Saturday, May 31, 2008

ఎప్పుడూ ఒదులుకోవద్దురా భాషను....

:::::::::

అసలు పాట ఆడియో ఇక్కడ

ఎప్పుడూ ఒదులుకోవద్దురా భాషను
ఎప్పుడూ వీడిపోవద్దురా బ్లాగును

విశ్రమించవద్దు ఏ క్షణం
విస్మరించవద్దు నీ కోణము
అప్పుడే నీ బ్లాగురా... నీదిరా...

ఎప్పుడూ ఒదులుకోవద్దురా భాషను
ఎప్పుడూ వీడిపోవద్దురా బ్లాగును

జాలమెంత గొప్పదైన బ్లాగుకున్న టపాలల్ల
పదునుముందు సద్దుమణుగురా
గూగులెంత పెద్దదైన ఎదుగుతున్న తెలుగుశైలి
మొక్క ముందు చిన్నదేనురా

యాడులోన యాడొ వుండి సిస్టం ని మింగు స్పైయ్యివేరు
ఒక్కనాడు నెగ్గలేదురా
గుటకపడని బ్లాగరుండ చీపుట్రిక్కులెంచుకుంటు
అడుగుహిట్ల మునుగుతుందిరా

దోష దారులెంతసేపురా
భాషోదయాన్ని ఎవ్వడాపురా
వెలుగుతున్న బ్లాగు కూడా శౌర్యగోళమంటిదేనురా

ఎప్పుడూ ఒదులుకోవద్దురా భాషను
ఎప్పుడూ వీడిపోవద్దురా బ్లాగును

నొప్పి లేని నిముషమేది లైవు యైన స్క్రాపు యైన
ప్రాజెక్టు అడుగుమడుగునా
బాసుచూసెనంటు నిలిచిపోతే కూడలైన నీది కాదు
బ్లాగు అంటే బాహ్య ఘర్షణ

శైలి వుంది శిల్పముంది
కూడలుంది జల్లెడుంది
అంత కన్న సైన్యముండునా

వ్యాఖ్య నీకు వాయువౌను
క్లిక్కు నీకు కీర్తనౌను
సమీక్ష నీకు సారధౌనురా

భీతిలేని బ్లాగుడున్నదా
సాహిత్యమంటు శిశువు పుట్టదా

అగ్రిగేటరంటు వున్న వరకు
భీరువంటు పారిపోక
బ్లాగు పైన భాషపతాక మెగురవేయరా…

ఎప్పుడూ ఒదులుకోవద్దురా భాషను
ఎప్పుడూ వీడిపోవద్దురా బ్లాగును

********************


ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి..
ఎప్పుడూ ఒదులుకోవద్దురా ఓరిమి.

విశ్రమించవద్దు ఏ క్షణం.
విస్మరించవద్దు నిర్ణయం.
అప్పుడే నీజయం నిశ్చయం రా.
ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి..

నింగి ఎంత పెద్దదైన రివ్వుమన్న గువ్వ పిల్ల
రెక్క ముందు తక్కువేనురా
నింగి ఎంత పెద్దదైన రివ్వుమన్న గువ్వ పిల్ల
రెక్క ముందు తక్కువేనురా

సంద్రమెంత గొప్పదైన ఈదుతున్న
మొప్ప ముందు చిన్నదేనురా
పశ్చిమాన పొంచి వుండు రవిని మింగు అసుర సంధ్య
ఒక్క నాడు నెగ్గలేదురా
గుటకపడని అగ్గి విండ సాగరాల నీదు కుంటు
తూరుపింట తేలుతుందిరా

నిషావిలాసమెంత సేపురా
ఉషోదయాన్ని ఎవ్వడాపురా
రగులుంత గుండె కూడ సూర్య గోళమంటిదేనురా

ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి..

నొప్పిని లేని నిమిషమేది జననమైన మరణమైన
జీవితాన అడుగు అడుగునా
నొప్పిని లేని నిమిషమేది జననమైన మరణమైన
జీవితాన అడుగు అడుగునా
నీరశించి నిలిచిపోతే నిమిముషమైన నీది కాదు
బ్రతుకు అంటే నిత్య ఘర్షణ.

దేహముంది ప్రాణముంది
నెత్తురుంది సత్తువుంది
ఇంతకన్న సైన్యముండునా...

దేహముంది ప్రాణముంది
నెత్తురుంది సత్తువుంది
ఇంతకన్న సైన్యముండునా...

ఆశ నీకు అస్త్రమవును..
శ్వాశ నీకు శస్త్ర మవును.
ఆశయమ్ము సారధవునురా

నిరంతరం ప్రయత్నమున్నదా
నిరాశకే నిరాశ పుట్టదా
నిరంతరం ప్రయత్నమున్నదా
నిరాశకే నిరాశ పుట్టదా

ఆయువంటు వున్న వరకు చావు కూడ నెగ్గలేక.
శవము పైన గెలుపు చాటురా
ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి..


సిరివెన్నెల గారికి క్షమాపణలతో

Wednesday, May 28, 2008

పండంటి బ్లాగుకు పదకొండు సూత్రాలు(కొత్త బ్లాగర్ల కోసం మాత్రమే) -- 2

:::::::::

మొదటి భాగం చదివి కాళ్ళు, చేతులు, మొఖమూ కడుక్కోని శుచిగా ఇక్కడికి రండి.అలా న్యూస్ రీల్ అయిపోయిన తరువాత సినిమా ఇలా మొదలవుతుంది.

ఈ సూత్రాలు రాసే ముందు ఒక్కో సూత్రాన్ని విశ్లేషించి ఒక్కో రీలు ఒక్కో టపాగా రాద్దామనుకున్నా కానీ ఇప్పటికే సినిమా రెండో భాగం లో వేసినందుకు కొంత మంది థియేటర్ అభిమాన ప్రేక్షకులకు కోపమొచ్చినందున మొత్తం 11 సూత్రాలు ఇక్కడే ఇచ్చేస్తున్నా :-)


1. బ్లాగు ముఖ్యోద్ధేశ్యం:
మొట్ట మొదటగా బ్లాగును మీరు ఏ ఉద్ధేశ్యంతో ప్రారంభించారు. అందరి నోళ్ళలో నానాలని ప్రారంభిస్తున్నారో లేక మీ వ్యక్తిగత ఆనందం కోసం ప్రారంభిస్తున్నారో లేక గూగులు ప్రకటనలతో నాలుగు రాళ్ళు సంపాదిద్దామని మొదలు పెట్టారో నిర్ణయించుకోండి.


2. ముద్రారాక్షసాలు :
మీరు మొదటిసారిగా టపా రాసేప్పుడు ముద్రణా దోషాలు తప్పవు. ముద్రణా దోషాలు వుంటే మాత్రం చికాకు కలిగించే అంశం.టపాలో వున్న విషయాన్ని బట్టి పాఠకులు స్పందిస్తుంటారు. మొదట్లోనే ఆహా, ఓహో అనిపించేట్టు రాయక పోయినా ఇబ్బంది పెట్టే ముద్రణాదోషాలు రాయొద్దు. ఇప్పుడు బ్లాగులు చాలా ఎక్కువయ్యాయి సావధానంగా చదివి ముద్రణా దోషాలకు స్పందించే వాళ్ళు తక్కువే అని గుర్తు పెట్టుకోవాలి.


3. ఎలా రాయాలి?:
1 పరుగు, 12 బంతులు, అయిదు వికెట్లు వున్నా కూడా గెలుస్తామో లేదో అని టెన్షన్ పడే హైదరాబాద్ డెక్కన్ చార్జర్స్ అభిమాని లాగా కాకుండా 6 బంతులు, 36 పరుగులు, 1 వికెట్ వున్నా తప్పకుండా గెలుస్తామనే రాజస్థాన్ రాయల్సు అభిమాని లాగా ఆత్మ విశ్వాసంతో రాయాలి. మీరేది రాసినా దాన్ని రెండు మూడు సార్లు సమీక్షించుకొని ప్రచురించడం మంచిది. రాసే విషయం లో స్పష్టత అవసరం. బ్లాగుల్లో మన ఇష్టమొచ్చింది రాసుకోవచ్చు కానీ ఆదరణ కావాలంటే మాత్రం స్పష్టత అవసరం. ఇవే ఎక్కువ కాలం మనగలుగుతాయి. మీ టార్గెట్ ఆడియెన్సు ఎవరో ముందుగా తెలుసుకొని అలాంటి వాటి మీద బ్లాగటం ఒక పద్దతి. అలా కాకపోతే మీకు పట్టున్న వాటి మీద మొదలు పెట్టి తరువాత అన్ని రంగాల్లోనూ దూకడం మంచిది. మీ బ్లాగు విజయవంతం కావాలంటే సృజనాత్మకత, పుస్తక పఠనం, స్పష్టత వుండాలి.


4. కొన్నాళ్ళకు ఏమి రాయాలి?:
మొదట్లో మీ దగ్గర వున్న డ్రీమ్‌ ప్రాజెక్ట్స్ అన్నీ రాసేశారు. తరువాత రాయడానికి ఏమీ లేదు ఏమి చేయాలి అని అనుకున్నప్పుడు కాలేజీలో రంగారావు చొక్క జేబులోనుండి రెండు రూపాయలు కొట్టేసి మస్తాన్ కొట్లో వన్ బై త్రీ టీ తాగేసిన విషయం వ్రాయండి. వీలయితే లైబ్రరీకి వెళ్ళి మీకు నచ్చిన పుస్తకం/సినిమా తెచ్చి దాని మీద మీ విశ్లేషణ చెయ్యండి. అలా రాస్తూ పోతే పాఠకులకు మీ మీద ఒక గురి ఏర్పడుతుంది. మొదట్లో అత్యుత్సాహానికి పోయి భూమండలాన్ని బుట్టలో పెడతా, నక్షత్ర మండలాన్ని నాన పెడతా, ఉట్టి మీది వెన్న మింగేస్తా అనే భారీ డవిలాగులు చెప్పకుండా సావధానంగా రాయండి.(నేనయితే ఏ అవిడియా రాకపోతే ఎవరు నేను, ఎవడ్రా రౌడీ, ఎవడైతే నాకేంటి లాంటి సినిమాలు చూస్తా. చప్పున ఓ అవిడియా వస్తుంది.)


5.మీ బ్లాగును ఆదరిస్తున్నారా?:
అన్నింటికి మించి బ్లాగులు రాసిన తరువాత ఆదరణ లేదని నిరుత్సాహానికి గురి కావటం. ఇందాక చెప్పినట్లు ఇది బ్లాగు ప్రయాణం. అందులో ముందుగా రైలెక్కిన వారికి పాత వాళ్ళతో ఎక్కువ పరిచయ ముండటం సహజం. ఆ చనువుతో కొత్త వారికన్నా పాత వారితో పలకరింపులు ఎక్కువుంటాయి. అంతే. అంత మాత్రం చేత మీరు రాసిన వాటికి ఆదరణ లేదని అనుకోవద్దు. కొన్ని టపాలు కేవలం పది మంది చదివి ఆ పది మంది కామెంట్లిచ్చినంత మాత్రాన మీరు రాసింది తక్కువని కాదు. మీ బ్లాగుకు ఎంత మంది వస్తున్నారు అని తెలుసుకోవడానికి స్టాట్ కౌంటరు లాంటివి పెట్టుకోవడం మాత్రం మరచి పోవద్దు. ఇంకా మై బ్లాగ్ లాగ్ లాంటివి వున్నాయి. దీని ద్వారా మీ బ్లాగుకు ఎంత మంది వచ్చారు అన్నది తెలుసుకోవచ్చు. ఏది రాసినా మంచి బ్లాగుకు ఆదరణ వుంటుందన్న విషయం మరచి పోవద్దు.


6. మీ బ్లాగు పదుగురిలో :
మీరు ఒక్క సారి బ్లాగు ప్రారంభించిన తరువాత బ్లాగు అగ్రిగేటర్లతో నమోదు చేసుకోవడం తో మీ పని అయిపోదు. అప్పుడప్పుడూ మీ ఆలోచనలకు సరిపోయే బ్లాగులను చదివి కనీసం నాలుగు లైన్ల కామెంట్లు వ్రాయండి. అలా వ్రాస్తే ఆ బ్లాగు వాళ్ళకు కూడా మీ బ్లాగు మీద ఆసక్తి కలగొచ్చు. ఇది పరస్పర డబ్బా కాకుండా చూసుకోండి. వచ్చిన కామెంట్లకు స్పందించడం మరిచి పోకండి. (ఇక్కడ మాత్రం నన్నొగ్గేయండి. నేను స్పందిస్తున్నానా అని ప్రశ్నించకండి. నేను దొంగయితే దొంగతనం చెయ్యొద్దు అని చెప్పడం మంచి మాటే కదా )ఈ మధ్యనే బ్లాగు ప్రారంభించిన బొల్లోజు బాబా గారి కామెంట్లు పరిశీలించండి. ఆయన రాసిన ప్రతి కామెంటూ స్పష్టంగా వుంటుంది. ఆయన కామెంటు రాయని బ్లాగు బహుశా లేదేమో.

ఎవైనా సీరియస్ విషయాల మీద వ్యాఖ్యానించే ముందు. రాసిన వ్యాఖ్యలను ఒకటికి రెండు సార్లు చూసుకొని వ్యాఖ్యానించడం మంచిది ఎందుకంటే తరువాత చదివేవాళ్ళు మీ వ్యాఖ్యను విభిన్న కోణాలలో పలు సార్లు స్పృజించి వ్యాఖ్యానిస్తారు. అందులో మీరు చెప్పాలనుకున్నది కాకుండా దానికి వ్యతిరేకార్థం స్పురించొచ్చు.


7. బ్లాగులో ఎన్ని రాయాలి?:
ఎన్నయినా రాయొచ్చు చెత్త రాయనంత కాలం.మీరు రాయటం మొదలు పెట్టిన తరువాత కనీసం రెండు వారాలకొక టపా రాయడం మరిచిపోవద్దు. రాయక పోతే జనాలు మిమ్మల్ని మరిచి పోతారు.


8. తెలుగు బ్లాగులలో ఎలా నడుచుకోవాలి?:
ఇప్పటి వరకు తెలుగు బ్లాగులన్నీ సుహృద్భావ వాతావరణం లో నడుస్తున్నాయి. వుంటే సైద్ధాంతిక విభేదాలుండొచ్చు గానీ వ్యక్తిగత విభేదాలను పెంచుకోవద్దు. ఎవరైనా వ్యక్తిగత విమర్శలకు దిగితే అనవసరంగా నోరు(బ్లాగు) పారేసుకోవద్దు. మనమేం మానవాతీతులం కాదు. అప్పుడప్పుడూ తేలిక పాటి యుద్ధాలు నడుస్తుంటాయి. వాటికి ఫిరంగులు ఫిక్సు చెయ్యకండి. విమర్శనాత్మక చర్చల్లో పాల్గొన్న బ్లాగులో వచ్చిన తరువాతి టపాకు సానుకూలంగా లేదా ఘర్షణాత్మక వైఖరికి దూరంగా స్పందించండి. అది చాలు అంతరాలు తుడిచి పెట్టుకు పోవడానికి. అలా అని మీరు అవతలి వ్యక్తి అభిప్రాయాలను, ఆలోచనలను అంగీకరించినట్టు కాదు.


9. నేను బాగానే రాస్తున్నానా?:
అక్కడక్కడా బ్లామీక్షలు (సమీక్ష) చూసి అందులో నా టపా లేదేంటబ్బా అని భాధ పడకండి. అవన్నీ వ్యక్తిగత ఇష్టాలు అయుండచ్చు. రాస్తూ వుంటే మీరే పెద్ద బ్లాగరు. మీరే పెద్ద సమీక్షకుడు/సమీక్షకురాలు.


10. ఏవి రాయకూడదు?:
బ్లాగుల్లో వ్యక్తిగత విషయాలు ఎక్కువగా రాయకుండా వుంటే మంచిది. రాసినా తగు జాగ్రత్తలు తీసుకోని రాయండి(ప్రత్యేకంగా ఆడవాళ్ళు). బ్లాగుల్లో ఎక్కువగా చిన్న తనం లో జరిగిన విషయాలు, జీవితానుభవ పాఠాలు రాయడం కద్దు. అలా రాసేప్పుడు అందులోని వ్యక్తుల పేర్లు మార్చి రాయడం మంచిది. ఇంకా అంతర్జాలం చీకటి కోణమెటువంటిదో తెలుసుకోవాలంటే సాలభంజికల మరో మెట్టు చదవండి.


11. బ్లాగులే జీవితం కాదు:
బ్లాగుల ద్వారా ఎన్నో మంచి విషయాలు తెలుసుకోవచ్చు. ఎంతో మంచి రచనలతో, పెద్ద రచయితలతో పరిచయభాగ్యం జరగచ్చు. మీ ఆలోచనలను ఇతరులతో పంచుకుని వ్యక్తిత్వ వికాసానికి సాయ పడవచ్చు. కానీ మీ వ్యక్తిగత జీవితాలను, దైనందిన వ్యాపకాలను పక్కన పెట్టే అంతగా వుండకూదదు. మీరు అంతర్జాలం లో దొరికే అడ్డమైన చెత్తా చదివే వాళ్ళయితే మాత్రం తెలుగు బ్లాగులు మీ ఆరోగ్యానికి ఎంతో మంచిది.

చివరగా వీవెనుకు జల్లెడోళ్ళకు ఓ సలహాభ్యర్థన : కూడలి రైలు పెట్టెకి కూడలండ్రెడ్ లా 'లేత బ్లాగర్లు' అనే పెట్టె తగిలించమని అభ్యర్థన. ఇందులో గత వందరోజులలో నమోదు అయిన లేదా ప్రారంభించబడిన బ్లాగులు వుంటే వారిని ప్రోత్సహించడానికి అనువుగా వుంటుంది.

అనంద బ్లాగింగ్ (Happy blogging)
:::::::::

Friday, May 23, 2008

ఈ వారం సిద్ధా-బుధ్ధ (డాలరు, కొత్త పార్టీ)

:::::::::


"అయ్యగారూ"
"ఏరా సిద్ధా"

"మనకు అమెరికా డాలర్ విలువ పెరిగితే మంచిదా తగ్గితే మంచిదా"
"మనకు అంటే ఇక్కడ రెండు రకాలున్నాయి. మన ప్రవాసాంధ్రులకా? లేక మన దేశ ప్రగతి కా?"

"ఆ లెక్కలు నాకు తెలీవు. రెంటికి తేడా ఏంటో చెప్పండి."
"డాలరు విలువ పెరిగితే మన ప్రవాసాంధ్రులకు మంచిది. ఇప్పుడున్న విలువ ప్రకారం ఒక డాలరుకు 42.60 పైసలు రావచ్చు. ప్లాట్లు కొనే వాళ్ళు ఓ వంద చదరపు అడుగులు ఎక్కువగా, భూములు కొనే వాళ్ళు ఓ అరెకరం ఎక్కువగా కొనుక్కోవచ్చు. అలాగే భారత్ లో వున్న ఎగుమతుల కంపెనీలకు కూడా లాభం. కాకపోతే దేశం లోకి దిగుమతి అయ్యే వస్తువులకు పైకం ఎక్కువ చెల్లించాల్సి వుంటుంది. ఇక దేశ ప్రగతి అనేది ఆ దేశపు కరెన్సీ మారకపు విలువ మీద ఆధార పడి వుంటుంది. డాలరుకు తక్కువ రూపాయలొచ్చే కొద్దీ మన రూపాయి బలపడు తున్నట్టు, దేశం అభివృద్ది చెందినట్లు లెక్క. "

"అంటే రూపాయి విలువ పడి డాలరు విలువ పెరిగితే మన దేశ సేవకులు స్విస్ బ్యాంకు లో పెట్టే డబ్బు తక్కువవుతుందన్నమాట.ఆ మధ్య ఓక్సు వాగన్ ఫ్యాక్టరీ కోసం పది కోట్లు అడ్వాన్సు ఇచ్చారు. అది తిరిగి వచ్చిందా ?"
"ఆ కంపెనీ వాళ్ళు ఖర్చులకింద రెండు మిలియెన్ యూరోలు మన ప్రభుత్వానికి ఇచ్చారు."

"ఏదో రూపం లో డబ్బు తిరిగి వచ్చిందన్నమాట. ఆ డబ్బు ప్రభుత్వానికిచ్చారా బొత్స సత్యనారాయణకిచ్చారా? "
"నువ్విలా అడిగితే ఎలా రా. ప్రభుత్వం పేరు మీద ఇచ్చారు. ఎవరికెళ్ళిందో తెలీదు. "

"ఆ కంపెనీ కోసం సేకరించిన భూమి కూడా జనాలకు తిరిగిచ్చారా?"
"తిరిగిచ్చేస్తే దాన్ని ప్రభుత్వం అనరు."

"మరి?"
"తమకు తిరిగివ్వమని రైతులు మొత్తుకుంటుంటే ప్రభుత్వం వాళ్ళు సైలెంటుగా అమ్మేసుకుంటున్నారు."

"అందుకే ఇలాంటి ప్రభుత్వం పోయి మా లాంటోళ్ళందరికి న్యాయం జరగాలంటే మా చిరు రావాల్సిందే."
"ఏంటి నువ్వు మొన్న హాజరయిన సెమినార్ లో ఇవి కూడా చెప్పారా?"

"లేదు ఆ సెమినారుకు వచ్చిన వాళ్ళలో చాలా మంది ఆ కొత్త పార్టీకి అభిమానులట."
"ఓహో, సెమినార్ లు పెడితే చాలా లాభాలున్నాయంటావ్."

"అవును ప్రవాసాంధ్రులు కూడా చాలా సెమినార్లు పెడుతున్నారు. మీరు చూడలేదా?"
"సెమినార్లేం ఖర్మ. ఏ రాజ కీయ నాయకుడొచ్చినా దిగంగానే సూట్ కేసులు మోసే చాలా ప్రవాసాంధ్రులను చూశా."

"వాళ్ళకు సూట్ కేసులు మోసే ఖర్మేమిటి. మరీ చోద్యం కాకపోతే."
"దేశ సేవ నాయనా. దేశ సేవ. తరువాత ఏ ఎమ్మెల్యే టికెట్టో, ఎం.పి. టికెట్టో వస్తే ప్రజలకు దగ్గరగా వుండి సేవ చెయ్యొచ్చని."

"అంటే ప్రవాసాంధ్రులు రాజకీయాల్లోకి రాకూడదా?"
"నువ్వు వేరే అర్థాలు తీయకురా అక్కుపక్షీ. రాకూడదని ఎవరన్నారు. భేషుగ్గా రావచ్చు. అలా వచ్చే వాళ్ళను స్వాగతిద్ధాం. సరే మీ రైలెప్పుడు వస్తోంది?"

"అన్నీ రెడీ అయిపోయాయి పెయింటింగ్ మాత్రం మిగులుంది. రేపో మాపో పట్టాలపైకి వచ్చేస్తుంది."
"మీ రైలొచ్చేలోపే బాలయ్య కూడ రైలెక్కుతున్నాడట గా"

" ఆయనెక్కుతున్నది పాత రైలు.ఇప్పటికే చాలా చోట్ల రిపేర్లొచ్చాయి. మా రైలయితే చాలా ఫ్రెష్షు. కొత్త టికెట్లు, కొత్త సీట్లు, కొత్త బోగీలు. బాలయ్య ఎక్కే రైలుకు టికెట్లు కూడా కొనక్కరలేదు. ఎన్టీఆర్ ఇచ్చిన రైలు పాస్ జేబులో రెడీ గా వుంటుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎక్కచ్చు. కొత్తగా ఎక్కేదేముంది రెక్కమాను డొక్క."

:::::::::



"అయ్యా నేను ప్రజల్లో ఒక్కడినేనా?"
"అవును"

"మీరు?"
"నేను కూడా"

"చిరంజీవి?"
"ప్రజల్లో ఒక్కడే"

"వై.ఎస్?"
"వై.ఎస్. కూడా ప్రజల్లో ఒక్కడేరా."

"చంద్ర బాబు కు కల్లో కూడా ప్రజలే కనిపిస్తున్నారట కదా. మీరు, నేను, చిరంజీవి, వై. ఎస్సూ అందరూ ప్రజలయితే మరి చంద్ర బాబెవరు?"
"ప్రజల్లో లేని వాడు అందుకే ప్రజల మధ్యకు వెళుతున్నాడు."


:::::::::


ఓ చిన్న బ్లాగాభిప్రాయ సేకరణ:



:::::::::

Wednesday, May 21, 2008

పండంటి బ్లాగుకు పదకొండు సూత్రాలు(కొత్త బ్లాగర్ల కోసం మాత్రమే) -- 1

:::::::::

మట్టిబుర్ర, ఒట్టి బుర్ర, తొట్టి బుర్ర, బంక బుర్ర కాదేదీ బ్లాగడానికి అనర్హం

అదేమిటి సూత్రాలేవన్నా వుంటే పది వుండాలి లేకుంటే పన్నెండు వుండాలి కానీ అనుకుంటున్నారా?
అక్కడే చూపించాలి కొత్తదనం. ఆ కొత్తదనం అనేది వైవిధ్యంగా వుండాలి. వైవిధ్యం పేరు చెప్పి నన్నయా, తిక్కనా క్లాస్ మేట్స్. వాళ్ళిద్దరూ ఎదురు బొదురు ఇళ్ళలో వుండే వాళ్ళు అని చెప్పేస్తే బ్లాగులోకి బుల్లెట్లొస్తాయ్. కొంచెం ప్రత్యేకంగా చెప్పాలి.

సరేనోయ్ ఇదెందుకు రాస్తునావో ఒక ముక్క చెబ్తావా?
గత ఆర్నెల్లుగా బ్లాగులు రాసే వాళ్ళు ఎక్కువయ్యారు. ఎక్కువయ్యారు అంటే మొదలు పెట్టే వాళ్ళు మాత్రమే ఎక్కువయ్యారు అని అర్థం. అవి కొనసాగించే వాళ్ళు చాలా తక్కువ మందయ్యారు. బ్లాగు పేర్లు నమోదు చేసుకొన్న వాళ్ళు చాలా మంది. అలా నమోదు చెయ్యడం కూడలి లో కావచ్చు, జల్లెడ లో కావచ్చు, తేనె గూడు లో కావచ్చు, తెలుగు బ్లాగర్స్ లో కావచ్చు. ఇంకా చక్రెడో అని ఒకటుందనుకుంటా. ఇప్పుడు ఇండీబ్లాగర్స్ అని ఒకటి వచ్చింది. అలా ప్రారంభించిన లెక్క చూస్తే ఎనిమిది వందలకు పైగా వుండొచ్చు. మొన్నా మధ్య కూడలి కొచ్చే యునీక్ హిట్లు ఎంత అని వీవెన్ ను అడిగితే సాధారణ రోజుల్లో 300+. వారాంతాల్లో ఇంకా తక్కువ అన్నారు. నేనయితే ఈ ఎనిమిది వందలు కాకుండా ఇంకో అయిదు వందలు ఉంటారు. తక్కువలో తక్కువ ఓ వెయ్యి మంది రోజూ బ్లాగులు చదువుతుంటారనుకొన్నా. వాస్తవంగా అది నిజం కాదు అని తెలిసి కళ్ళలో నీళ్ళు కారబోతుంటే స్పాంజి పెట్టి ఆపి బాధ పడ్డా. జల్లెడ, తేనె గూడు, తెలుగ్ బ్లాగర్స్కు ఎంత మంది వస్తారో తెలీదు(కనుక్కోలేదు సరైన సమాచానం).

బ్లాగులంటే ...
అమెరికాలో అయితే "హౌ టూ డ్యాష్ ఎఫెక్టివ్లీ" (డ్యాష్ ఖాళీలో ఏదైనా పూరించుకోండి) అని ఒక పుస్తకం రాస్తే మూణ్ణెల్లలో ఆరు ముద్రణలకు నోచుకుంటుంది. డిల్లీ సెంట్రల్ హాల్లో లైట్లేసి ఆ రచయితకు కలువభూషణ్ అని బిరుదు కూడా ఇస్తారు. మన తెలుగు వాళ్ళు అట్టే పుస్తకాలు (కొని) చదవరు. ఎక్కడన్నా పుస్తకం దొరికితే "మాస్టారూ, దీన్ని పట్టుకెళ్ళి చదివేసి రేపు ఉదయం మీ ఇంటి ముందు మీరు ముగ్గెయ్యక ముందే తెచ్చిస్తా" అంటారు. ఆ పుస్తకం తిరిగొస్తే టి.వి.యాంకరమ్మ తెలుగు మాట్లాడినంత ఒట్టు. ఇప్పుడు పుస్తకాలు కొనే వాళ్ళు తక్కువై పోయారు. వీళ్ళందర్నీ లైన్లో నిలబెట్టి ఆ లైన్లో నడుచుకుంటూ ముందుకు వస్తే నా మొహం రెండోది అయుంటుంది.అరువు ఇచ్చేవాళ్ళు అంతకన్న తక్కువై పోయారు. పాపం వీళ్ళనెందుకు అవమానించడం అని వీళ్ళని కూడా లైన్లో పెడితే, ఈ లైన్లో నా మూడు క్యాండిల్స్ మొహం మొదట కనిపిస్తుంది. ఇప్పుడు ఆ పుస్తకాల కొరత తీర్చడానికి అంతార్జాలమొచ్చింది. దాదాపుగా ఏది కావాలన్నా అందులో దొరుకుతుంది. దాని నెత్తి మీద గూగులొచ్చింది. అందువల్ల పుస్తకాలు కొనే వాళ్ళు లేరు, అడుక్కునే వాళ్ళు లేరు. ప్రతి దానికి గూగ్లేయడమే.(కొంత మంది పద్దతి గా అజో విభో ఫౌండేషన్‌ కి వెళ్ళి పుస్తకాలు కొంటారు) అలా వెబ్ లో చాలా విషయాలు లాగుతున్న వాళ్ళ లోంచే పుట్టికొచ్చిందే ఈ బ్లాగ్.

అందులో తెలుగు వాళ్ళు లేకపోతే ఈ టపా రాసే అవసరముండేది కాదు. అలా ఎప్పుడూ తెలుగు వార్తలు, కథలు, నవలల కోసం వెదుకుతున్న వాళ్ళందరూ కలిసి ఈ వెదుకులాటకు ఏదైనా పేరు పెట్టాలనుకొన్నారు. కానీ మన పక్క నున్న పక్క రాష్ట్రం వాళ్ళు వుంటే తమ పేరు పెట్టుకోవడం కష్టమని గ్రహించి వాళ్ళందర్ని ఒక రూములో కట్టేసి, పులిహోర పేకెట్లు, దద్ధోజనం పేకెట్లు ముందర పడేసి దీనికి "వెబ్ లో లాగుడు" అని పేరు పెట్టారు. కాల క్రమేణా అది "వెబ్ లాగుడు" అయింది. ఇది చూసిన ఫ్రెంచి వాళ్ళు, డచ్చి వాళ్ళు "మాకు డు పలకడం రాదు" అని దానికి "వెబ్ లాగు" అని పేరు పెట్టారు. తెలుగుకు ప్రాచీన భాష హోదా ఇవ్వక పోయిన ఫరవా లేదు కానీ నవీనంగా మేము కనిపెట్టినదాని పేరు మారుస్తారా? అని అడ్డం పడ్డారు మన వాళ్ళు. "లాగు అంటే మా ఐ.ఎస్.ఐ. మార్కు పట్టా పట్టీల నిక్కరు కాబట్టి మేమొప్పుకోం" అని తెలిసినోళ్ళందరికీ ఈ-మెయిల్ పంపించారు. ప్రతి ఈ-మెయిల్ లో కింద మీరొక్కరికి ఫార్వర్డ్ చేస్తే మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఆరు సెంట్లిస్తారు అని నోట్ కూడా పెట్టారు. సరిగ్గా ఈ సమయం లోనే పంధ్రాగస్టు స్పీచిలు టి.వి.లో చూడ్డం జరిగింది. సో అందరూ అదొక ఉద్యమంగా తీసుకొని ఈ డచ్చి వాళ్ళని ఇప్పుడే ఆపకపోతే తరువాత బ్రిటీషు వాళ్ళొస్తారు ఆ తరువాత నెహ్రూ ఫ్యామిలీ వాళ్ళు వచ్చేస్తారు అని డచ్చి వాళ్ళ మీద తిరుగుబాటు చేశారు. పిల్లులు రొట్టె కోసం పోట్లాడుకుంటుంటే కోతి రావాలి కదా వెంటనే అదోచ్చి (పజిల్: ఎవరో మీరే చెప్పుకోవాలి) "వె..వ్వె..వ్వె.." అని వె పీకేసి "బ్లాగు" అని నామకరణం చేశారు. ఎవరన్నా బ్లాగు ఎలా పుట్టిందని వేరే వాళ్ళు చెబితే నమ్మకండి. ప్రత్యేకంగా పశ్చిమ దేశస్తులను. మీ ఇంట్లో పెద్ద రాళ్ళు గట్రాలుంటే వాటి మీద ఈ స్టోరీ ఎక్కించేసి మీరు నీళ్ళకోసం తవ్విన ఖాళీ బావిలో పెట్టి చుట్టూ రెండు పాత రాగి రేకులు వేసి పాతెయ్యండి. పాతేసి మన తెలుగు ప్రాచీనాన్ని కాపాడండి.
ఈ టపాకి సంబందించిన బ్లాగు నిర్వచనం అయి పోయింది.


మీరు కొత్తగా బ్లాగు ప్రారంభించిన తరువాత కామెంట్లు రాక పోవడమో, హిట్లు రాకపోవడమో జరిగి "బ్లాగు గతి ఇంతే.." అని విరహ గీతాలు పాడుకోవద్దు. నా లాగే రాసిన వేరే కొన్ని టపాలకి కామెంట్లొస్తున్నాయి గానీ నాకు రావట్లేదు అని విచారానికి గురి కావద్దు. ఈ బ్లాగు ప్రయాణం అనేది రైలు ప్రయాణం లాంటిది. మీకన్నా ముందే రైలెక్కిన వాళ్ళు ఎక్కువగా వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకోవడం సహజం. దాన్ని చూసి నిరాశకు లోను కావద్దు.

ఈ బ్లాగు ప్రయాణం లో నాకు కనపడిన రైళ్ళు రెండు ఒకటి 'కూడలి', రెండు 'తెలుగు బ్లాగర్స్'. నేను చూసినప్పుడు అవి మీటర్ గేజీ మీద నడుస్తుండేవి. ముందరో ఇంజెను పెట్టె వెనకో ప్యాసింజెర్ పెట్టె వుండేవి అంతే. ఈ రైల్లో పని చేసే డ్రైవరూ, గ్యాంగ్ మెన్, టికెట్ మాస్టర్ తదితర ఉద్యోగ వర్గమంతా ఎవరో బాగా తెలిసేది. అలాగే అందులో ప్రయాణించే వాళ్ళు కూడా ఒకరికొకరు బాగా తెలిసే వారు. రాను రాను ప్రయాణీకులెక్కువయిపోయారు రైలు పెట్టెలెక్కువయి పోయాయి. కూడలి కయితే ఏ.సి., నాన్ ఏ.సి. లాగా రకరకాల పెట్టెలు కలిసాయి. ఆ పెట్టెలకు పేర్లు పెట్టేశారు కూడలండ్రెడ్ , సాహిత్యం, రాజకీయం, హాస్యం, సేకరణలు, సినిమా అని. ఇప్పుడు అది బ్రాడు గేజీ మీద నడవడమే కాకుండా సూపర్ ఫాస్టు రైలు బండిలా పరిగెడుతోంది. తేనె గూడు కూడా బ్రాడ్ గేజులో కొచ్చేసింది. తెలుగు బ్లాగర్స్ కాస్త స్లోగా నడుస్తోంది. దట్స్ తెలుగు వాళ్ళు కూడా బ్లాగు బాట పట్టారు.

కొత్త బ్లాగోడి మనసు ఎలా వుంటుందో ఫ్ల్యాష్ బ్యాకు లో చదువుకోవాలంటే ఖైదీ నంబరు 300 కెళ్ళి కాసేపు చదువుకోండి.

సుత్తి సరే విషయమెక్కడ?
వస్తునానన్నా వస్తున్నా. అక్కడికే వస్తున్నా. సినిమా మొదలయ్యే ముందు మంచి అడ్వర్టైజ్మెంట్లు వుంటాయి. ఎందుకనుకుంటున్నారు? సినిమా బాగా లేకపోతే అవి చూసిన తృప్తయినా మిగులుతుందేమో అని. అందుకే నేను బోనస్ లు ఇస్తుంటా. ఫ్లాపు సినిమా కెళ్తే ఆడియో సి.డి.లు ఉచితంగా ఇవ్వడమనే ప్రక్రియే నాకు పూర్తి స్పూర్తి.

సరే అడ్వర్టైజ్మెంట్ అయిపోయింది సినిమా మొదలు పెట్ట వేంటి?
అక్కడే మెక్సికో లో పండించిన పెసర పప్పు లో కాలేశారు. సినిమా థియేటర్ లో అడ్వర్టైజ్మెంట్ తరువాత ఏఁవొస్తుంది? న్యూస్ రీల్ రాదా? అన్నీ చెప్పాలి...ఈఁ

మేము న్యూస్ రీల్ చూసి చాలా కాలమయింది. మీది పాత థియేటరా?
అవును పాత థియేటరే. ఇది నా థియేటరే కాబట్టి న్యూస్ రీలు పూర్తి కాకుండా సినిమా మొదలవదు. డెత్ నట్లు చూడాల్సిందే. ఈ టైములో గేట్లు మూసేస్తాం బయటికెళ్ళలేరు. ఇక న్యూస్ చూడండి.

భారత్ ఇండియా పెద్ద లోగో..
చిన్న లొగో...
ఇంకా చిన్న లోగో...
చిన్న చుక్కయిన లోగో ...
ఏమీ లేని లోగో...

ఇప్పుడు వెనక గ్రవుండు లో పాట

మన్మే హై విశ్వాస్....
మన్మే హై విశ్వాస్....

పాట ఎక్కువ సేపు వుండదు. బట్టీ పట్టేసి పార్లమెంటుకొచ్చి పాడతారని భయం.

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ సమాచార శాఖ అందిస్తున్న వార్తలు

ఏడమ వైపు తాడు కాలిపోతూ ..కుడి వైపు తొలకరి వాన పడుతున్న వెండి తెర పై..

గూని పల్లెలో శంఖు స్థాపనలు.
కోడి ఈకల పాలెం లో శంఖు స్థాపనలు.
బుట్టాయి గూడెం లో శంఖు స్థాపనలు.
ఐతె పల్లె లో శంఖు స్థాపనలు.

న్యూస్ రీల్ అయిపోయింది.

అసలు సినిమా రెండో భాగంలో మొదలవుతుంది.

:::::::::

Thursday, May 15, 2008

ఈ వారం సిధ్ధా- బుధ్ధ (గోల్డు క్వెస్టు, మహిళా బ్లాగర్ల సమావేశం )

:::::::::


"అయ్య గారూ.."
"ఆఁ, సిద్ధా! "

"నాకు.. నాకు.. "
"ఆ నసుగుడెందుకు విషయం చెప్పు.. "

"నాకు సెలవులు కావాలి? "
"ఓస్ అంతేనా దానికెందుకు నసగడం. నువ్వడగడం నేను కాదనడమూనా. "

"మీరివ్వరని కాదు గానీ మొన్నా మా సంఘపోళ్ళు పెట్టిన మీటింగుకు వెళితే యజమానులను మెప్పించడమెలా అనే దాని మీద సెమినార్ ఇచ్చారు. అందులో, యజమానంటే భయపడుతున్నట్టు నటించడం ఒక టెక్నిక్ అంట. అందుకే అలా నసిగా. "
"బావుంది. నటించడమేనా ఇంకా గొడ్డళ్ళతో, గన్నులతో, పెన్నులతో భయ పెట్టి పనులెలా చేయించుకోవాలో కూడా చెప్పారా? "

"అది రెండో సెమినార్ లో చెబుతారంట. దానికి ఫీజు కట్టాలంట. "
"అలా అయితే నీకు పెర్మనెంట్ సెలవులు ఇస్తా. తీసుకుంటావా? "

"అయ్య బాబోయ్ అలా అంటా రేంటండీ. నేనేదో సరదాకెళ్తేనో. అది కూడా మా రంగడు బలవంత పెట్టి తీసకబోతే. "
"రంగడంటే గోల్డ్ క్వెస్ట్ గాడేనా? "

"అరె భలే గుర్తుపట్టేశారే. మీక్కూడా తెలుసా. "
"తెలుసా ఏంట్రా బాబూ, మొన్న నువ్వు బయటికెళ్ళినప్పుడు నీ కోసమొచ్చి గోల్డు క్వెస్టు గురించి చెప్పి నా మెదడు ఫలహారం కింద మింగేశాడు. . "

"రజనీకాంత్ ఫ్యామిలీ, చిరంజీవి ఫ్యామిలీ, బాలకృష్ణ ఫ్యామిలీ అందరూ ఇందులో వుండారని చెప్పాడా? "
“వాళ్ళ పేర్లు చెప్పలేదు గానీ ఇంకో పది మెట్లెక్కి ఇందులో అమితాబచ్చన్, ధీరూ భాయ్ అంబానీ, ముఖేష్ అంభానీ, బిన్ లాడెన్, ఫీడెల్ కాస్ట్రో ఫ్యామిలీ వాళ్ళు కూడా వున్నారని చెప్పాడు. "

"వీడి దుంప తెగ. అమ్మో వీడు చంద్రమోహన్ దగ్గర ట్రైనింగు తీసుకున్నానని చెప్పాడే. చూడబోతే చంద్ర మోహన్ కే ట్రైనింగు ఇచ్చినట్లు వున్నాడు. వీడిని ఈ సారి మైకు పెట్టి సతికేస్తా. "
"సతికితే సతికావు గానీ తమ్మా రెడ్డి భరద్వాజ లాగ బి సీరీసు, జి సీరీసు పదాలు టి.వి. కెమరా ముందు మాట్లాడకు. పేపరోళ్ళు నిన్ను హెడ్లైన్లో పెట్టి నన్ను బాక్స్ అయిటం చేస్తారు. "

"మీరూరుకోండి. ఇప్పుడు పేపర్లో మన గురించి రాసేంత చోటెక్కడుంది వాళ్ళకి. అంతా ఉప ఎన్నికల గురించి రాస్తున్నారు. కొద్దో గొప్పో ఖాళీ వుంటే నాలుగేళ్ళ పాలనలో ప్రగతి అంటూ ఊదర కొట్టుకుంటారు. ఈ సారి ఉప ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనుకుంటున్నారు? "
"ఇంకెవరు టి.ఆర్.ఎస్. "

"మీరు కూడా అలా డిసైడయిపోయారా. ఏటూ వాళ్ళే గెలుస్తారని తెలిసినప్పుడు వాళ్ళ వల్లే ఎన్నికలొచ్చాయని వాళ్ళకు బుద్ది రావాలంటే ఓడించండి అని ఇతర పార్టీలు అరవడమెందుకు? హాయిగా వాళ్ళకే వదిలేసుంటే ఎన్నికల ఖర్చు మిగిలేది, సమయం ఆదా అయ్యేది. అప్పుడు మేమే అనవసర ఖర్చు ఆప గలిగాం అని పెద్ద స్టేట్మెంట్ ఇచ్చుకొని నిజంగా ఇది ‘మీ కోసం’ అని బాబు చెప్పుకొనుండచ్చు. వై ఎస్సేమో ఈ డబ్బును ప్రాజెక్టులకు ఖర్చు పెడతాం అని ప్రజల దగ్గర మార్కులేయించుకొని వుండచ్చు. ప్చ్... చాన్సు మిస్సయింది. "
"ఏంటి మీ సంఘం మొదటి సెమినార్లో ఇన్ని విషయాలు చెప్పారా? మీటింగుకు వెళ్ళొచ్చిన తరువాత తెలివి తేటలు బాగానే పెరిగాయే. "

"అప్పుడే ఏమయ్యింది బ్లాగులో మహిళ లందరూ సమావేశం పెడుతున్నరు గదా. మా ఆడది కూడా సమావేశానికి వెళతానని సంబర పడుతోంది. అప్పుడు చూడాలి నా సామి రంగా మా ఓల్ ఫ్యామిలీ తెలివితేటలు. "
"నిన్ను బ్లాగులు చదవమని చెబితే ఆ దురద మీ ఆవిడకు కూడా అంటిస్తావా? ఇంతకూ వాళ్ళేం మాట్లాడు కుంటున్నారో తెలుసా? "

"వాళ్ళు అసలు విషయం చెప్పట్లేదు. అందుకే గదా గూఢచారి లా మా ఆడదాన్ని పంపిస్తోంది. మీరు అట్లా ఏమీ తెలీనట్లు నటించండి. గుట్టంతా మా ఇంటిదాని చేత చెప్పిస్తా. అప్పుడు అవన్నీ మీ బ్లాగులో పెట్టుకోవచ్చు. "

"అవుడియా బానే వుంది కానీ. మీ ఆవిడ కూడా ఒక బ్లాగు మొదలు పెట్టేస్తే పరిస్థితి ఏంటి? "
"అవునండోయ్, అప్పుడు తాకిడికి గురయ్యేది మీ కంప్యూటరే. మనకు టైము దొరకదు. "

"వాళ్ళేమి మాట్లాడుకోని వుంటారో నాకు బాగా తెలుసు. "
"అదేదో నా చెవిన కూడా పడెయ్యండి. "

“... దు....”
"ఓహో అలానా...”

“.........కు.....”
"ఇంకా.... "

"…తె... "
"అమ్మా ఇవి కూడా? "

".....నా..... "
"అయ్య బాబోయ్"

"...లీ..... "
"నా కళ్ళు తెరిపించారు కదా. "

"రా........ "
"అలాగే ఎవరికీ చెప్పనులెండి. "

"వీళ్ళ మీటింగుకు నేదురుమిల్లి రాజ్యలక్ష్మిని పిలుచుంటే ఏమయ్యేది? "
"సమావేశం పేరు ప్రమదావనం కాకుండా ఇందిరా మహిళా బ్లాగర్ల సమేవేశం అయుండేది"

"వై.ఎస్. ను పిలుచుంటే? "
"సోనియమ్మ మహిళా బ్లాగర్ల సమావేశం అయుండేది. హైదరాబాద్ లో జరిగే సమావేశానికి రాజీవ్ బ్లాగర్ల సమావేశం అని పేరు పెట్టుకోమని పోరొచ్చుండేది"

"జగన్ ను పిలుచుంటే? "
"సాక్షి మహిళా బ్లాగర్ల సమావేశం అని పిలిచి అందరి ఫోటోలు తీసుకొని రెండు రూపాయలకే అన్ని పత్రికలూ రావాలని నినదించిన మహిళా బ్లాగర్లు అని ఫ్రంటు పేజి లో వచ్చుండేది. "

"బాబును పిలిచుంటే? "
"మీ కోసం మహిళా బ్లాగర్ల సమావేశం అని చెప్పి రోజాను పంపించి వుండే వాడు. "

"కె.సి.ఆర్. ను పిలిచుంటే? "
"............."

"చెప్పవేరా? "
"............"

"ఎందుకలా పారి పోతున్నావ్? "
"............"

"చెప్పు ఎందుకలా పారిపోతున్నావ్? "
"ఇంకా అర్థం కాలేదా?.... సింబాలిక్ గా చెప్పా. "



:::::::::

Wednesday, May 14, 2008

భ్లాగర్ల కథ ( నా వల్ల కాదు )

తప్పకుండా చదివాల్సింది:

పొద్దులో కొల్లూరి సోమశంకర్ గారు రాసిన బ్లాగర్లకో లేఖ చదివిన తరువాత నా డ్రాఫ్టు తవ్వకాల్లోంచి దీన్ని బయటకు తీసా. ఇది నూరో టపాగా విడుదల చెయ్యాల్సి వుండె. పూర్తి చెయ్యడం చేత కాక దీని బదులు బ్లాగోళ జంభ వీడియో విడుదలచేశా. పొద్దులో రాసిన సోమశంకర్ గారికి అభినందనలు. మీరింకా చదవక పోతే ఓ ట్రిప్పేసి తరువాత ఇక్కడికి రండి. ఒకే అవుడియా పది మందికి వస్తుందనడానికి ఇంకొక ఉదాహరణ. మీ బుర్ర స్క్రీన్‌ పై తళుక్కుమన్న "ఇలాంటివి మాట్లాడ్డం నీ కలవాటే గా" అన్న అక్షరాలు బర బర చెడిపెయ్యండి. మళ్ళీ నా మీద సెటైరెయ్యకండి.

తప్పకుండా చదవాల్సింది ఇంకొంచెం:

కింద రాసిన బ్లాగుల పేర్లే కాకుండా ఇంకా చాలా రాయాల్సి వుంది వాటిని రాయడానికి కుదరక మధ్యలో ఆపేశాను. ఇందులో ఉదహరించ బడ్డ బ్లాగు పేర్లకు, వాళ్ళ అసలు పేర్లకు, వాళ్ళ జీవన విధానానికి, వాళ్ళ బ్లాగు విధానానికి, వాళ్ళ ఉద్యోగాలకు, వాళ్ళ ఇంకా చానా చానాలకు ఏ మాత్రం సంబంధం లేదు.

-- ఇదే నా వీర శూర Disclaimer ...


కథ మొదలయ్యింది :

ఓ తెలుగు విద్యార్థి కి తెర చాటు చందమామ లా తెలుగు కోసం తపన పడుతున్న వాళ్ళెందరున్నారో తెలుసుకుందామనే కుతూహలంతో కలిగింది. పదుగురికి ఏదో చెప్పాలనే తపన రోజు రోజుకీ బలీయమయింది. ఇలా ఒంటరిగా ఊహా ప్రపంచం లో మునిగితే సరిపోదు. తనకున్న తెలుగు తీపి ఇంకా ఎంతమందికుందో తెలుసుకోవానే తలపు కలిగడం ఆలస్యం వెళ్ళి తన అంతరంగాన్ని వాళ్ళ నాన్న కి చెప్పాడు.

అది విన్న వాళ్ళ నాన్న చిత్తూరు నాగయ్య లాగా "ఇలా మనసులోని మాట చెప్పి భాష ఊసులు తెలుసుకోవాలనే భావన కలగడం ఎంతో సంతోషం. తెలుగు భాషా అన్వేషి వై బయలు దేరు. నీ అభీష్ట సిద్ధిరస్తు. ఎక్కడా నిరాశా, నిస్పృహ లకు లోను కాకుండా పారదర్శి వై దిగ్విజయంగా తిరిగిరా. తిరిగి వచ్చిన తరువాత నీవు విన్నవీ-కన్నవీ, అవీ-ఇవీ అన్నీ మాకు వినిపిస్తే మేము వాటిని సంగ్రహాలయం లో భద్రపరుస్తాం నాయానా. ఇదిగో ఇక్కడ నున్న మహిమాన్విత కీలు గుర్రం తీసుకెళ్ళు. దాని మీద కూచుని ఈ శాస్త్రం లో చెప్పబడిన విధంగా మంత్రం జపిస్తే నువ్వు కోరుకున్న చోటకు వెళుతుంది." అన్నాడు.

"అలాగే నాన్నా! తపస్వి అయిన మీరు నాకు ఓనమాలు దిద్దించి అమృత వర్షం లా వేదాల్నీ, పురాణాల్నీ అవపోశన పట్టించి నన్నింతగా తీర్చిదిద్దినరనే విషయం నా మనో ఫలకం పై ఎప్పటికీ వుంటుంది " అని చెప్పి సెలవు తీసుకున్నాడు.

విక్రమాదిద్యుడి సింహాసనానికికున్న సాలభంజికల రూపుతో చెక్కబడిన ఆ కీలుగుర్రాన్ని ఎక్కి మంత్రాన్ని జపించాడు. సౌమ్యంగా ఆ బొమ్మను ఒక్క సారి చరిచాడు. లయ బద్దమైన సవ్వడి చేసుకుంటూ మరుక్షణమే అది స్వేచ్చా విహంగం లా గాలిలోకి ఎగిరింది.

అది నిండు పౌర్ణమి. జాబిల్లి వెన్నెల విరబూసి పసిడి కాంతులు వెదజల్లుతోంది. అలా గాలిలో ఎగురుతూ తను ఇంతవరకూ ఆ అడవి లో తను చూడని ఎన్నో చిన్న చిన్న అందాలను చూసాడు. సన్నని జల్లు కురవడం మొదలైంది. తన ఒంటి మీద పడ్డ చినుకుల్ని చూసి వెన్నెల చినుకులంటే ఇవే నేమో అనుకున్నాడు. కాసేపు సేద దీరుదామని కిందికి దిగాడు. అక్కడ హరివిల్లు లా వంగిన పూల తీగల పొద దగ్గిర ఆసీనుడయ్యాడు. ఆ పూల పొద పక్కనున్న బావిలోకి వంగిన చెట్ల కొమ్మలకు కట్టుకున్న గిజి గాని గూళ్ళు వెన్నెల కాంతిలో స్పష్టంగా కనిపించాయి. ఆ అందాలను అలానే చూస్తూ వుండగా నిద్ర పట్టేసింది. ఊదయ భానుని లేత కిరణాలు మీద పడుతుండగా వసంత కోకిల కిల కిలా రావాలకు నిదుర లేచాడు. కాల కృత్యములు తీర్చుకుని అక్కడ కింద పడ్డ రేగు పండు ను చూశాడు. అక్కడ రేగు పండు వుండిన ఎడల ఇంకా ఏమైన ఫలములు దొరుతాయేమో నని వెదికిన తరువాత బృందావనం లాంటి ఆ వనంలో అన్ని రకాల చెట్లు కనపడ్డాయి. వాటిని కడపు నిండా తిని కీలు గుర్రమెక్కి కళార ను మహా సముద్రాన్ని దాటి కొంచెం వెళ్ళగానే ఆ వాతావరణం కొత్తగా అనిపించిది. ఇదే ఆంధ్ర పర్యావరణం కాబోలు అనుకున్నాడు. తను ముందుగా వెళ్ళాలనుకున్న ఆంధ్ర దేశం రాజధాని వైపు గుర్రాన్ని తిప్పాడు. కాసేపటిలో గోల్కొండ, బుద్ధ విగ్రహం కనిపించాయి. వాటిని చూడగానే కీలు గుర్రం వింత శబ్దం ఎహెహీహీఎ అని చేసింది. విద్యార్థి కి అర్థం మయిపోయింది ఇక్కడ ఏదో వాతావరణ కాలుష్యముందని. అందుకే కీలూ బొమ్మ కూడా తన బాషలో నా గోల అర్థం చేసుకో అని అరిచింది. హైద్రాబాద్ అవుటర్ రింగ్ రోడ్డుకు ఆరు కిలోమీటర్లు దూరంలో గుర్రాన్ని ఆపి తేలుగు నేల పై అడుగుపెట్టాడు. అక్కడనున్న పొదల పక్కన ఆపేసి దాని మీద కొన్ని ముళ్ళ కంపలు పరిచేశాడు.

పొదల సందుల్లోంచి ఋ ౠ అనుకుంటూ గుర్రం ఆగిపోయింది. అక్కడి నుండి దిగి నడిచిన తరువాత నల్లగ నిగనిగ లాడుతున్న నాలుగు రోడ్ల కూడలి కనిపించింది. కలగూర గంప లాగా వున్న రోడ్డును చూసి ఎటు పోవాలో అర్థం కాక రోడ్డు కూడలి దగ్గర నిలుచున్నాడు. రోడ్డు పక్కనే కబుర్లు చెప్పుకుంటున్న ఇద్దరు రైతులు కనిపించారు. దగ్గరకు వెళ్ళి వాళ్ళను పలకరించాడు. తన వేషం కూడా దాదాపు వారి లాగే వుండటం వల్ల వాళ్ళు అప్యాయంగా పలకరించారు. హైద్రబాదు కు వెళ్ళు అని వాళ్ళు చెప్పిన వైపు నడక సాగించాడు. రోడ్డు మీద వచ్చే పోయే వాహనాలను చూసి ఆంధ్ర ప్రగతి చాలా వుందనుకొన్నాడు. సాయంత్రానికి చార్ మినార్ చేరుకున్నాడు. అక్కడ రోడ్డు దాటడానికి నానా తంటాలూ పడవలసివచ్చింది. ఇదేదో జగమే మాయ లాగా వుంది ఎవరో ఒకరి సహాయం తీసుకోకపోతే కష్టమే అనుకొన్నాడు. అంతలో ఈ-తెనుగు చొక్కా వేసుకొనొకతను కనిపించాడు. హమ్మాయ్యా ఇతనెవరో తెలుగబ్బాయ్ లాగా ఉన్నాడని అతన్ని ఆపి "చూడు తెలుగోడా త్రినేత్రుడి కి కూడా ఈ రోడ్డు దాటటం కష్టం. దీన్ని దాటాలంటే నాకు ఎన్నో ధర్మ సందేహాలు వస్తున్నాయ్. వాటిని తీర్చగలవా" అని అడిగాడు.


"చూడూ! నా పేరు తెలుగోడా కాదు ఫణి పక్కా తెలుగబ్బాయ్. ఇదిగో అక్కడ బడి పిల్లగాళ్ళు రోడ్డు దాటుతున్నారు. వాళ్ళతో పాటు నిన్ను రోడ్డు దాటించేస్తా రా. నేను నా ఫ్రెండ్స్ ను కలవాలి" అని చెప్పి రోడ్డు దాటించేసి వెళ్ళి పో యాడు.

"నారాయణ..నారాయణ , ఏడు కొండలవాడా వెంకట రమణ" అనుకుంటూ రోడ్డు దాటేశాడు. రోడ్డు దాటిన తరువాత ఒక్కసారి వెనక్కి తిరిగి చూసి ఇదంతా జగమే మాయ గా వుంది. ఆ జగన్నాటక సూత్రధారి ఇక్కిడి కొచ్చినా ఎవరూ పట్టించుకోరు అని అనుకొంటూ వున్నాడో లేదో ఎవరో తన చేతిలో ఒక కర దీపిక పెట్టేసి వెళ్ళిపోయాడు. తీరా చూస్తే అది తెలుగు పుస్తక మహోత్సవం గురించి, అక్కడ జరగనున్న సాంస్కృతిక మహోత్సవాల గురించి. ఏలాగైనా అక్కడికి వెళ్ళాలని నిర్ణయించుకొన్నాడు. ఈ సారి ఎవరి నైనా అడుగు దామంటే ఎవరూ ఖాళీ గా కనిపించలేదు. ఫ్రతి వాళ్ళూ చెవిలో సెల్ ఫోను పెట్టుకొని నా గోల నాది అన్నట్టుగా వున్నారు. అక్కడ బైక్ ఆపి నా గోల అనుకుంటూ మాట్లాడున్న ఒక యువకుడి దగ్గర నిలుచున్నాడు. స్పీకర్ ఫోను పెట్టి మాట్లాడుతున్నందువల్ల అన్నీ వినిపిస్తున్నాయి.
"జలజా నేను చెప్పేది విను.నేను తొందరగా వచ్చేస్తా"
"నువ్వెంతసేపూ నేనూ నా సాహిత్యం అంటూ తిరగడమే కానీ నన్ను పట్టించుకోవా"
"నువ్వే నా ప్రాణం. నా మనసు నీకు తెలుసు కదా నే రాసిన నా రాతలకు ఎప్పుడో ఓ సారి సాహిత్య అకాడమీ అవార్డు వస్తుంది. అలా వస్తే అందులో నీకే గదా సగం దక్కేది"
"నిజం గా తొందరగా వచ్చేస్తారు కదూ"
"నువ్వలా ఎదురు చూస్తూ వుండు. అభిరాం హోటల్నుండి పూత రేకులు, కిరణ్ ఫ్లవర్ మర్కెట్ నుండి సన్న జాజులు తీసుకుని వచ్చేస్తా" అని ఫోను పెట్టేశాడు.
ఇతను కూడా పుస్తక ప్రదర్శనకు వెళ్తున్నట్టున్నాడు ఇతన్ని లిఫ్ట్ అడిగితే పోలా అని దగ్గరకెళ్ళి అడిగాడు.

కథ ఆగిపోయింది.

(అంతే ఇంకా 280(అప్పట్లో) బ్లాగులున్న పేర్లతో ఈ ట్విస్టులతో రాయడం కుదరని "హ్యాండ్స్ అప్" అన్నా.)

సోమశంకర్ గారు,

మీరు రచయిత కాబట్టి అయ్యవారి బొమ్మ అనుకున్నారు అదే వచ్చింది. నేను గీసింది ఎలా వచ్చిందో చూడండి. మీ రాతకు టొపీ తీశాను.

-- విహారి

(ఈ టపా పోస్టు చెయ్యకూడదని చివర్లో ఆపేశా. కానీ ఇవాళ ఫణి గారు ? నాడు-నేడు కు కామెంటుచేస్తూ కాన్‌సెప్టు ఎవరైనా కాపీ చేశారా అన్నారు. ఏటూ ఆ ఇమేజీ వచ్చింది కదా అని సంక్రాంతి సినిమాలప్పుడు పెద్ద సినిమాల్తో పోటీ పడి చిన్న సినిమా రిలీజ్ అయినట్టు రిలీజ్ చేసేస్తున్నా )


త్వరలో రాబోయే టపా : బ్లైన్‌,బ్లిస్కీ,బ్లోడ్కా,బ్లీరు తాగేసి బ్లాగడమెలా

Friday, May 09, 2008

నాడు -- నేడు

* * * *


నాడు :

"రేయ్ నిద్దర లేసినావా?" ఇనప గ్రిల్లుకు అద్దం తగిలిచ్చి పెట్కొని స్టూలు మింద పెట్న మగ్గులో నీళ్ళు పోసుకుని, పనామా బ్లేడు తో గడ్డం గీసుకుంటున్న నాన్న అరుపు.
"...."

"రేయ్ నిన్నేరా పిలిసేది. రేత్రంతా లైట్ పోలుకింద మినకర్ బూసిల్తో ఆడి ఇబ్బుడు లెయ్యమంటే రగ్గు కప్పుకోని ఆ పక్కకు తిరగతావా. నిద్దర బొయింది జాలు గానీ లెయ్. "
"ఊ.." ఇంట్లో నవారు మంచం మింద ఆప్కో దుప్పటి కప్పుకొని పండుకున్న కొడుకు.

"పండుకునింది చాల్లే వాయ్. లేసి గూట్లో పెట్న గోపాల్ పండ్ల పొడితో పండ్లు తోముకో. మీ యమ్మ పొయ్యి మింద వుడుకు నీళ్ళు పెట్టింది నీ కోసరమని.బిర్నే లెయ్ లేక్పోతే నీళ్ళు సల్లగయిపోతాయ్. "
"ఊ... నైనింగారుంతసేపు పండుకుంటా"

"రేయ్ నిన్ను.. నీకిట్ల జెబ్తే యాడ లేస్తావ్. నీకిచ్చేది ఇచ్చెయల్లలే . ఆ కట్యాడికి బొయ్యింది.." కట్టి కోసం నాన్న ఎదకతా వుంటాడు.
"ఓయమ్మా నన్ను కొట్టద్దు సామీ నేను లేస్తా.." కొడుకు లేచి బచ్చల్లోకి పరిగెత్తి పూడస్తాడు.

అర్ధ గంట తర్వాత…

తలకు జిడ్డాముదం పెట్టి కుడి పక్కకు దువ్విన క్రాపుతో, నల్ల పట్టీల తెల్ల చొక్కా, వి షేపు ఎర్ర నిక్కరు ఏసుకోని ఉప్మా తట్ట ముందు స్కూలు కెళ్ళే కొడుకు ప్రత్యక్షం.

నేడు:

"నాన్నా కొండలూ.." తన రూములో నుండి లేచి బ్రష్ చేసుకొని, ఆటోమటిక్ షేవర్ తో షేవింగ్ చేసుకుంటూ కొడుకు రూములో అడుగు పెడతాడు నాన్న."గుడ్ మార్నింగ్ నాన్నా! లేయ్. స్కూలుకు టైమవుతోంది"
"ఊహూ..."

"నాన్నా! అదిగో చూడు అందరు పిల్లలూ రెడి అయిపోతున్నారు. స్కూలు బస్సు కూడా వచ్చేసింది."
"ఊ.. ఐ వాంట్ టూ స్లీప్ ఫార్ సమ్మోర్ టైం"

"స్కూలుకు టైమయిపోతుంది కన్నా."
"ఊ హూ.. ఐ సెడ్ ఐ వాంట్ టూ స్లీప్ ఫార్ సమ్మోర్ టైం. "

"అదిగో నీ రూములోకి ఎలకొచ్చింది…"
"ఊ.."

"ఇదిగో పిల్లి కూడా వచ్చింది..మ్యావ్..మ్యావ్"

దుప్పటి కొద్దిగా తెరుచుకుంటుంది ఒక కన్ను మాత్రం దుప్పట్లోంచి బయటకు వస్తుంది.

"అదిగో నీ బ్లాంకెట్ లో కొచ్చింది.."
"ఎక్కడా?"

"ఇదిగో ఇక్కడ"
"ఐ డొన్ ట్ సీ ఇట్.."

"మ్యావ్..మ్యావ్.."
"నో..నువ్వే పిల్లి.."

"ఇదిగో లేచేశావ్. వెళ్ళి బ్రష్ చేసుకో"
"నో.." దుప్పట్లోకి మళ్ళీ.

"అదిగో ఈ సారి పులొచ్చింది...గాండ్రు...గాండ్రు..."
"నో నువ్వే పులి.."

(అలా బోలెడన్ని క్రూర జంతువుల్ని , ఎగిరే పక్షుల్ని, పాకే పాముల్ని, గెంతే కప్పల్ని రూములోకి రప్పించిన తరువాత.)

"అదిగో లేచేశావ్. దా బ్రష్ చేసుకో నాన్నా. స్కూలుకు టైమవుతోంది ”
"అయితే నన్నెత్తుకో" దుప్పట్లోనుండి కొడుకు.

అలా ఉప్పు మూట ఎత్తుకుని బాత్ రూములోకొచ్చి బ్రష్ మీద పేస్టు పెట్టిస్తే రెండు సార్లు లెఫ్టూ రెండు సార్లు రైటూ చేసి బ్రష్షు మళ్ళీ నాన్న చేతిలోకొచ్చేస్తుంది. అప్పుడు నాన్న మిగిలిన లెఫ్ట్లూ, రైట్లూ, అప్ లు, డౌన్ లు చేసి కొడుకును షవర్ లోకి తోస్తాడు.

అర్ధ గంట తరువాత...

లోపల పొడుగు చొక్కా వేసి దాని మీద ష్రెక్ పొట్టి చొక్కా వేసి మడచిన జీన్స్ పాంటూ, పాలిష్ చేసిన బూట్లు వేసుకొని నెత్తిన చిన్న క్యాప్ పెట్టుకొని (ఒక్క ముక్కలో పోకిరి స్టైల్లో ) డైనింగ్ టేబిల్ మీద వున్న ప్యాన్ కేక్ (తీపి అమెరికన్ దిబ్బ రొట్టె) తింటానికి రెడీ.

* * * *

Wednesday, May 07, 2008

ఈ వారం సిధ్ద -- బుద్ధ (ట్వెంటీ ట్వెంటీ, డెమోక్రసీ)

:::::::::


"అయ్య గారూ .."
"చెప్పవోయ్ సిద్ధా .."


"వైరస్ కి బాక్టీరియాకి తేడా ఏంటి?"
"బాక్టీరియా దొంగయితే వైరస్ టెర్రరిస్టు. ఏంటి సైన్సు మీద పడ్డావ్. ఏ ట్వెంటీ ట్వెంటీ మీదో పడతావనుకుంటే"


"ఒక్క చెంప దెబ్బ మూడు కోట్లు ఖరీదు చేస్తుందని తెలిసినప్పట్నుండి దాని జోలికి వెళ్ళడం లేదు."
"అయినా మ్యాచ్ లు చూస్తున్నావ్ గా "


"అదీ...."
"అర్థమయింది లే చీర్ లీడర్ల కోసం"


"అది కాదు! మన దేశం లో అలాంటి బీదా బిక్కి బట్టలేసిన డ్యాన్సులు ఎందుకు ప్రవేశ పెట్టారు? ఏ సంప్రదాయ నృత్యాలో పెట్టొచ్చు గదా"
"వాళ్ళు వేసుకునే డ్రెస్సులకూ మ్యాచులకీ అవినాభావ సంబందం వుందోయ్"


"డ్రెస్సులకూ, మ్యాచులకూ సంబంధమేంటండీ. జార్జి బుస్షు లా మట్లాడ తారు. మరీ విడ్డూరం కాకపోతే."
"మొదట్లో అయిదు రోజుల మ్యాచులు వుండేవా? అందరూ వాటిని చూసి ఆనందించేవారా. ఎక్కువ ఆనందం కోసం తరువాత 60 ఓవర్ల వన్డే లొచ్చాయా? అవి కాస్తా 50 ఓవర్లయ్యాయా. ఇప్పుడు వాటిని ఇరవై చేశారు. ఆ ఇరవైకి తగ్గట్టే డ్రెస్సులు వేసుకుంటున్నారు."


"అయితే 5 ఓవర్ల మ్యాచులొచ్చినప్పుడు ఏ గొట్టం గాడు టీములో వున్నా స్టేడియం అంతా నిండి పోతుందన్నమాట"
"అవును అప్పుడు నువ్వు టీం లోకి వెళ్ళొచ్చు "


"!!!!!"
"అలా నోరు వెళ్ళ బెట్టకు కాస్త ముయ్. వైరసులు వెళ్ళగలవు లోపలికి. వెళ్ళి ఆ మూడు పత్రికలు తీసుకొని రా"


"ఇది గోండి చదువు కోండి. నేను పత్రికలు చదవడం మానేస్తున్నా."
"ఏరా నీ మీద సెటైరేసినందుకు ఫీలవుతున్నావా? నా మీద కూడా వేస్తుంటావు కదా సె..టై..ర్లు.."


"అది కాదండీ, ఇంతకు ముందు ఏ రాజకీయ నాయకులో, ఏ ప్రజా సంఘాల నాయకులో తిట్టుకునే వళ్ళు. ఇప్పుడు ఈ పత్రికలోళ్ళు తిట్టు కోవడం మొదలు పెట్టారు."
"దీనికే అలా 'ఆ రెండు' పత్రికలంటే పడని వై.ఎస్. లాగా అయిపోతే ఎలా? ఇప్పుడు ఇరవై నాలుగ్గంటల తరువాత వచ్చే తిట్లే చూస్తున్నావ్. రేపో మాపో సాక్షి తరఫున ఓ టి.వి. చానెల్ వస్తుంది. అందులో వాళ్ళు గంటకో సారి, నిముషాని కోసారి ఒకర్నొకరు తిట్టుకుంటారు అప్పుడేం చేస్తావ్?"


"అందుకే టి.వి. కనిపెట్టిన వాడు తెలివిగా రీమోట్ కూడా కనిపెట్టాడు."
"నీ తెలివికి టోపీలు తీసేశాం"


"రెండు రూపాయలకి కిలో బియ్యం, రెండు రూపాయలకి పేపరూ వస్తున్నాయి కదా. ఇంకా రెండు రూపాయలకేమేమి వస్తాయి?"
"రెండు రూపాయలకే దహన క్రియలు"


***:O:***


"అయ్యా డిప్లమసీ అంటే ఏంటి?"
"భారత్ లో మధ్య తరగతి వాళ్ళు ఎక్కువ అన్నం తినబట్టే బియ్యం ధరలు పెరిగాయన్న బుష్ గురించి మాట్లాడమని మన్మోహన్ సింగు నడిగితే 'నో కామెంట్' అన్నాడు. అదే డిప్లమసీ"


"ఓహో. మన మనసులో నున్న భావాన్ని డీప్ గా మసి చెయ్యడమన్న మాట. మరి డెమొక్రసీ అంటే"
"ముందు మంచి చేస్తున్నట్టు డెమో ఇచ్చి తరువాత రక్కసి లా దోచు కోవడం. ఇంకా చెప్పాలంటే పాద యాత్ర చేసి నడిచినంత దూరం వేరే పాదాలు నడవకుండా నరికెయ్యడం."


:::::::::

Thursday, May 01, 2008

కేజీ బియ్యం అయిదు సెంట్లకు అర్జీ -- 1

* * * *


అమెరికాలో మొదటి ప్రపంచ యుద్ధం, రెండో ప్రపంచ యుధ్ధం అప్పుడు కూడా నిత్యావసర వస్తువుల మీద రేషన్ విధించ లేదట. ఆ రేషన్ కోత మొట్ట మొదటి సారిగా ఇప్పుడు కొన్ని స్టోర్ల వాళ్ళు విధించారు. ఆ రేషనేదో ఏ బ్రెడ్డు ముక్క మీదనో ఏ పీట్జా ముక్క మీదనో విధిస్తే అమెరికా ఫుడ్డు కన్నా నా భారత్ ఫుడ్డే మిన్న అని విర్రవీగే నా లాంటి అర్ధ బడాయి గాళ్ళు సంతోషించే వాళ్ళు. పోయి పోయి బియ్యం మీద, గోధుమల మీద పెట్టారు కన్ను. ఏమంటే కొరతంట. ఈ మాట టి.వి. లో వినడం ఆలస్యం చాలా మంది దేశీయులు భారత చిల్లర కొట్లకెళ్ళి వీలయినన్ని బియ్యపు బస్తాలు కారు డిక్కీలో వేసుకొని వచ్చేస్తున్నారు. భారత రెస్టారెంటు గాళ్ళు ఊరుకుంటారా? వాళ్ళు ట్రక్కులు తీసుకెళ్ళి నింపేసుకోని వెళ్ళిపోతున్నారట. ఇప్పుడు వెళ్ళి చూస్తే అన్ని చోట్లా బియ్యం నిల్లు, గోధుమ పిండి నిల్లు. కొలెస్టరాల్ వున్న నా లాంటి వాళ్ళ పరిస్థితి ఏమి కావాలో?

పోయిన అక్టోబర్ లో 50 పౌండ్ల బియ్యం ధర $10.84 వుండేది కాస్ట్ కో(చైన్ స్టోర్స్) లో. ఇప్పుడు అది $16.75 వుంది. అలాగే భారత్ నుండి వచ్చే బాస్మతి బియ్యం పది పౌండ్ల బస్తా $8.84 ఇప్పుడు $15.75 పలుకుతోంది. ఇక గోధుమ పిండయితే భారత్ అంగళ్ళలోనే దొరుకుతుంది. అది కూడా ఆరు నెలల కిందటి ధరతో పోలిస్తే రెండింతలయింది. ఆ మధ్య పప్పు ధాన్యాల కొరత అని అందరూ రేట్లు రెండింతలు,మూడింతలు చేసి అమ్ముకోని లెక్సస్ లూ, బెంజిలూ కొనుక్కున్నారు. ఈ సారి విమానాలు, హెలికాప్టర్లూ కొనుక్కుంటారేమో. ఇప్పుడు కొరత లేకపోయినా ధరలు మాత్రం దిగి రాలేదు. ఏమన్నా అంటే అమెరికా కి ఎగుమతులు ఆపేశారంట అని అంటారు. ఇక్కడ ధరలు చంద్రున్ని దాటి అంగారకుడి వీపు ని టచ్ చేస్తుంటే అక్కడ రైతులకు వెయ్యి రూపాయలు గిట్టు బాటు ధర ఇవ్వడానికి రైతులకు చుక్కలు చూపిస్తోంది. ఈ కొరత భారత్ లోనూ వుందని భారత ప్రభుత్వం యాభై లక్షల క్వింటాళ్ళ బియ్యం సేకరణకు పూనుకొందట.

ఈ కాస్ట్ కో వెధవ... బ్రస్షులకు, పేస్టులకు కూపన్లు పంపిస్తాడు కానీ బియ్యానికి కూపన్లు పంపించడు. తొందర్లో వాటికి మానేసి వీటికిస్తాడేమో చూడాలి. ఇవ్వకుంటే మెంబర్షిప్పు క్యాన్సిల్ చేస్తానని బెదిరించి చూస్తా. ఈ బెదిరింపు వినగానే బాగా తాగున్న చీమ ఏనుగుతో ‘నాకడ్డొస్తే నలిపేస్తా’ అనే కథ గుర్తు తెచ్చుకోకండి.

మొన్నో రోజు మా వాడు ఏదో బొమ్మ కావాలన్నాడు. అది కొనాలంటే ఓ నలభై మైళ్ళు వెళ్ళి రావాలి. వద్దురా అంత దూరం వెళ్ళడం వేస్టు. గ్యాసుకు (అనగా పెట్రోలుకు) బాగా ఖర్చవుతుంది అన్నా. మరి వాడేమో కార్లో వెళ్దామంటే ఒద్దు ఎస్.యు.వి. (స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్) లోనే వెళ్ళాలంటాడు. దానికేమో సిగ్గెక్కువ ఓ గ్యాలన్ పోస్తే "చీ పొండి" అంటూ ఓ 15 మైళ్ళ తరువాత ఆగిపోతుంది. దాని పొట్ట పీకల్దాకా నింపి వెళితే నాకు గొంతులో వెలక్కాయ్ , బ్యాంకు బ్యాలన్సు లో గిలక్కాయ్ పడుతుంది. గ్యాసు ధరేమో గ్యాలన్ 4 డాలర్లను తాకుతూ దోబూచులాడుతోంది. ఎనభై మైళ్ళు వెళ్ళి రావాలంటే ఓ ఇరవైకి పైగా డాలర్లు ఫట్. అందుకే కొంచెం దూరంగా వున్న వాళ్ళు ఈ మధ్య పార్టీలకు పిలిస్తే "ఐ లవ్ టూ కం టూ యువర్ పార్టీ. ఐ లైక్ పార్టీస్ అండ్ ఫ్రీ బీర్. బట్ అన్‌ఫార్చునేట్లీ మా అవిడకు జలుబు చేసింది. మా బుడ్డిదానికి జ్వరం చేసింది. మొన్న డిష్ వాషర్ లో గిన్నెలు పెడుతుంటే ఎలక నా వేలు కొరికింది." అని తప్పించుకొని గిఫ్టు డబ్బులు, గ్యాసు డబ్బులూ మిగిలించుకొని కరువు కాలం కోసం దాచుకుంటున్నారు.

రెండు మూడు రోజుల ఫ్ల్యాష్ బ్యాక్ :

నేను Born with silver spoon అయుంటే నాకు ఈ బాధలుండేటివి కాదు గదా అని మా అమ్మకు ఫోను చేసి "నేను కడుపులో వున్నప్పుడు వెండి చెంచా ఎందుకు మింగలేదు" అని అడిగా.

"మింగుంటే బావుండేదిరా. అప్పుడు నువ్వు ఏ వికలాంగుడిగానో పుట్టి రిజర్వేషన్‌ క్యాటగిరీలో మనూళ్ళో మండలాఫీసులో రికార్డు అసిస్టెంట్ గా చేరి మా కళ్ళ ముందే వుండే వాడివి..ప్చ్ " అంది.

ఫ్ల్యాష్ బ్యాక్ అయిపోయింది.

అలా మా బుడ్డోడిని బొమ్మ వద్దన్నందుకు వాడు ఓ పెద్ద స్టేట్మెంట్ ఇచ్చాడు.

"నన్ను లైఫ్ లో కాపాడే వాళ్ళు నలుగురు. వాళ్ళు యమదొంగ, పండు (మహేష్ బాబు), శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్., మై హార్ట్ ఈజ్ బీటింగ్ అని పాట పాడే వాడు (పవన్ కళ్యాణ్)".

వీడు అదను చూసి దెబ్బ కొడతాడు. అలా ఎందుకన్నావో చెప్పరా అంటే చెప్పలేదు. ఈ సారి ఏ గాలి పటాలు ఎగరెయ్యడానికో, చేపలు పట్టాడానికెళ్ళినప్పుడో వీడి గడ్డానికి పూజ చేస్తూ మాట్లాడితే గానే మనసు విప్పి చెప్పడు. ఇక్కడే వుంటే వీడు ఇంకా ఇలాంటి మాటలెన్నో అంటాడని భారత్ కు తిరిగి వెళ్ళి పోదామని ఆలోచించడం మొదలు పెట్టా. కానీ అక్కడికెళితే కూడా ఆ ధరల దెబ్బకు బతకలేమని తెలిసిపోయింది. ఏవన్నా ప్రాజెక్టులు పడదామంటే కాంగ్రేస్ పార్టీ లో దగ్గరి బంధులెవరూ లేకపోయిరి. మా ఆవిడ బంధువులెవరన్నా వున్నారేమో అని వాకబు చేస్తే లేరని చెప్పింది.అదో డ్రాబ్యాక్. చావో రేవో ఇక్కడే తేల్చుకోవాలి. దీని మీద ఎందుకైనా మంచిది కొంత మందితో చర్చిద్దాం అని ఆలోచించాను. ఆలోచించిందే తడవు గా నాలాంటి ఎకనామిక్ గాళ్ళందరికీ ఓ ఈ మెయిల్ కొట్టా.

దాని సారాంశం..

"అమెరికాలో బియ్యం ధరలు ఆకాశాన్నంటుతున్నాయ్. మిర్ స్పేస్ స్టేషన్‌ వాళ్ళు హాబులు టెలీస్కోపు నుండి చూసినా కానీ ధరలు కనిపించడం లేదంట. అంతంత డబ్బులు పెట్టి బియ్యం కొనలేం. ఇప్పుడిస్తున్న జీతాలతో మనం బతకలేం. కాబట్టి ఆంధ్ర ప్రదేశ్ లో మన వై.ఎస్. ఇస్తున్నట్టు రెండు రూపాయలకు కిలో బియ్యం పథకం ఇక్కడ కూడా అమలు చేసేటట్లు మన మందరం ప్రయత్నిద్ధాం. అక్కడ డాలర్లు ఇక్కడ రూపాయలు, అక్కడ కేజీలు ఇక్కడ పౌండ్లు లాగా కాకుండా ఇక్కడే కేజీ ఒక్కింటికి (2.2 పౌండ్లు) రెండు రూపాయలకే అంటే అయిదు సెంట్లకే ఇచ్చేట్టు మన జార్జి డబ్ల్యూ బుస్షు ను అడుగుదాం. గ్రీను కార్డులు ఇచ్చినట్లే బియ్యం కార్డులు కూడా అడుగుదాం. అందరం మాట్లాడుకొని అర్జీ పెట్టుకుందాం. మనము అడిగితే కాదనే దమ్ములు ఎవరికీ లేవు. మనం తెలుగు వాళ్ళం కలిసి కట్టు గా సాగుదాం.

-- జై తెలుగు తల్లి "

అల్లూరి సీతారామరాజు సినిమా లోని "తెలుగు వీర లేవరా ..." అనే పాట కూడా అటాచ్మెంట్ గా పంపించా స్పూర్తి కోసం. ఈ-మెయిల్ ఓపన్‌ చెయ్యగానే పాట మొదలయ్యేట్లు చేశా.

అంతా తెలుగు వాళ్ళేనా ఎందుకు ఇతరులను కలుపుకోలేదు అంటే అమెరికాలో వున్న తెలుగు వాళ్ళతో పోలిస్తే ఇతర భారతీయుల శాతం 0.000000000001. ఒక్క తెలుగోడొస్తే వెంటనే లింకు సర్వీసు స్టార్టవుతుంది. మొదట వాడి పెళ్ళాం, ఇద్దరు బామ్మర్దులు వస్తారు. ఆ ఇద్దరు బామ్మర్దుల పెళ్ళాలు. మళ్ళీ ఆ ఇద్దరు బామ్మర్దుల ఇతర బామ్మర్దులు వచ్చేస్తారు. ఈ బామ్మర్దుల రద్దీ ని క్యాష్ చేసుకోవాలని బ్రీటిష్ ఎయిర్ వేస్ వాళ్ళు వాళ్ళ కంపెనీ ని స్పినాఫ్ చేసి జగన్‌ ఎయిర్ వేస్ (ట్యాగ్ లైన్‌: బామ్మర్దుల స్పెషల్ ) అని కొత్త కంపెనీ మొదలు పెట్టబోతున్నారని కూడా విన్నాను.

అలా ముగ్గురికి ఈ-మెయిల్ కొట్టిన నలభైఏడున్నర సెకండ్లకు నా మెయిల్ బాక్సుకు 32 ఈ-మెయిల్స్ వచ్చేశాయి తిరపతి లో గుండు కొట్టుకోవడానికి అప్పుడే గోదావరి ఎక్స్ ప్రెస్ నుండి దిగిన గోవిందయ్య చుట్టూ టాక్సీల వాళ్ళు చుట్టు ముట్టినట్లు.

మొట్ట మొదటి ఈ-మెయిల్ జిడ్డు సుబ్బారావ్ గాడినించి వచ్చింది.

"మామా! నీ అయిడియా అదిరి పోయింది. మామూలుగా నాకే ఇలాంటి అయిడియాలు వస్తాయి అలాంటిది ఇంత వరకు నాకు కూడా రాలేదు ఈ అయిడియా. ఈ మధ్య తెలుగు సినిమాలు చూడ్డం మానేశావా ఏంటి. మనం అందరం తెలుగు వాళ్ళం కలిసి కట్టుగా వుందాం. ఈ వీకెండ్ కలుద్దాం. బీరు కూడా నీదే మామా. నువ్వేమీ బాధపడకు నీకు శ్రమ లేకుండా కావాలంటే బీరు ఓపనర్ నేనే తెస్తా ."

ఉగాది శుభాకాంక్షలు ఈ-మెయిల్ పంపిస్తే చూడకుండానే ట్రాషు చేస్తాడు దొంగ సన్నాసి గాడు. అటువంటిది కెజీ బియ్యం అయిదు సెంట్లకు అనగానే వాయు వేగంతో రిప్లై ఇచ్చాడు. వీడు బీరు ఓపనర్ కారు కీస్ కు వేసుకొని తిరుగుతుంటాడు. మొన్నే ఇక్కడున్న కూర్స్ బీరు కంపెనీ వాళ్ళు వీడిని కంపెనీలోకి రాకుండా బ్యాన్‌ చేశారు. విజిట్ కోసం వచ్చాడు కదా అని సాంపిల్ కోసం కొంచెం తాగమంటే అప్పుడే బయటికి డెలివరీ అవుతున్న ట్రక్కులోని మూడు కేసులు ఓపన్‌ చేసి తాగేశాడట. డబ్బుల్లేక పోతే చేతికున్న పెళ్ళి ఉంగరం లాక్కున్నారట.

ఇంకో మెయిల్ సన్నాయి నొక్కుల సంజీవ్ రావ్ నుండి.

"బాబాయ్!

నేను మీటింగులో వుంటే జనార్ధన్ గాడు వాడి బ్లాక్ బెర్రి కి వచ్చిన ఈ-మెయిల్ చూపించాడు. ఆగకుండా నీకు ఈ-మెయిల్ పంపించేదానికి మీటింగు నుండి వచ్చేశా. మన దేశానికి చాలా దూరంగా వున్నాం. మనకు మనం కాకపోతే ఇంకెవరు సహాయం చేస్తారు. తప్పుకుండా కలుద్దాం. మట్లాడుకుందాం. మన తెలుగు వాళ్ళ పవరు చూపిద్దాం.

-- జై జై తెలుగు తల్లి"

వీడికి Y2K లో పంపించిన న్యూ ఇయర్ విషెస్ కి ఇంతవరకు సమాధానం లేదు. కాంకర్డ్ విమానం లో ఇంజిను తీసుకెళ్ళి వాడి ఈ-మెయిల్ సర్వర్లో పెట్టినట్టున్నాడు.జన్మకో శివ రాత్రి అన్నట్లు ఈ-మెయిల్ పంపిస్తాడు. అటువంటిది కేజీ అయిదు సెంట్లనగానే ఈ మెయిల్ పంపించేశాడు. వీడు ఫ్రీగా వస్తే ఫినాయిల్ తాగడు. దాన్ని కొత్త బాటిల్ లో పోసేసి ఆమ్వే వాళ్ళకు అమ్మేసి డబ్బులు తీసుకుంటాడు. వీడు వాళ్ళకు మొన్నే బెస్టు బయ్యర్ అవార్డు ఇచ్చాడు.


ఇంకోటి సప్రెస్డ్ శివరామ్‌ నుండి.

"Dear respectable friendly and lovely Mr. Vihaari garu,

Namaste and good morning.

Thanks for sending this to me.(నేను పంపలేదు. ఎవడో ఎకానమీ గాడు ఫార్వర్డ్ చేసింట్టున్నాడు) We need people like you who can take initiative on such a wonderful cause. We are suppressed and oppressed people here. We need a leader like Gandhi and Nehru. And Martin Lutherking too. If you want I can takeover this task from you. You know, I have bald head. We should show telugu power to the people around here. Please..please...please....give me opportunity to become like Abraham Lincoln. (ఎదురుగా వుంటే కాళ్ళ మీద పడే వాడేమో) I will give big credit to you. (అంటే నీకు చాలా ఋణపడి వుంటాను అని అర్థం)

-- Jai Jai Jai Jai ..(అంతా జై జై అనే వుంది. ఎనిమిది సార్లు పేజ్ డౌన్‌ నొక్కిన తరువాత....) Telugu talli."

ఈయనెప్పుడూ మాతృబాష, మాతృబాష అంటూ వుంటాడు ఇంగ్లీషులో. ఏంటో బియ్యానికి suppressed and oppressed కి సంబంధం అర్థం కాలేదు. ఆయన ఆవు మీద వ్యాసం టైపు. జెన్నీఫర్ లోపెజ్ గురించడిగినా , జెల్లీ ఫిష్ గురించడిగినా సప్రెస్డ్ అండ్ అప్రెస్డ్ అంటాడు. అందుకే ఆయన పేరు సప్రెస్డ్ శివ రామ్‌ . ఆయనతో కాసేపు మాట్లాడితే నెహ్రూ జైల్లో వున్నప్పుడు ఇందిరా నెహ్రూ కు రాసిన ఉత్తరాల నుండి దత్తన్న వై.ఎస్.కు రాసిన ఉత్తారాల వరకు అనర్గళంగా మాట్లాడుతాడు.

తరువాతి ఈ-మెయిల్ చుప్పనేని ఝాన్సీ గాంధి నుండి.

" మీ లాంటోళ్ళని చూస్తే ముచ్చటేస్తుంది.మనం తప్పకుండా ఈ బియ్యం మీద ఒక ఉద్యమం చేపట్టాల్సిందే. నేను కూడా నా వంతు కృషి చేస్తాను. ఈ వారాంతం మీటింగు కు రాలేను.ఎందుకంటే మా అమెరికన్‌ కొలీగు ఇంట్లో పార్టీ వుంది. దానికి అడల్ట్స్ మాత్రమే అలోడ్. మా ఆయనని మీటింగుకు పంపిద్దామంటే ఇంట్లో పిల్లల్ని చూసుకుంటూ బేబీ సిట్టింగు చెయ్యాలి.అందు వల్ల ఆయన కూడా రాలేరు. మీరు మాట్లాడుకున్న విషయాలు నాకు పంపించండి. దీని కోసం ఏదైనా ఫోరమ్‌ పెడితే చెప్పండి. దానికి డొనేషన్‌ లు వగైరా ఎంతైనా సరే మూడు డాలర్లకు మించకుండా పంపిస్తాను.

-- జై తెలుగు తల్లి"

అబ్బో మూడు డాలర్లంటే చాలా ఎక్కువే. చాలా దాదృత్వం కలదీవిడ. ఈవిడ H-1 వీసా మీదొస్తే వీళ్ళాయన H-4 డిపెండెంట్ వీసా మీదొచ్చాడు. అదీ బడాయి. పిల్లలున్న వెనక సీట్లో వాళ్ళయనుంటే ఈవిడ డ్రైవ్ చేస్తుంది. ఈవిడొస్తే ఆడోళ్ళందరూ మాట్లాడ్డం మానేస్తారు. ఎందుకలా అంటే మాకు అమ్మలక్కల్లాగా మాట్లేడే వాళ్ళుంటే బావుంటుంది అంటారు.

ఇంకో మెయిల్ ఎవరో కొత్త వారి దగ్గరినుండి.

గబ గబా చదువుకోవాలి .

"మాస్టారూ,

మీరెవరో నాకు తెలీదు గానీ మీ అయిడియా బ్రహ్మాండం.
మీరు బ్రహ్మాండం.
ఈ వీకెండ్ కలిస్తే బ్రహ్మాండం.
అందరూ తెలుగు వాళ్ళయితే బ్రహ్మాండం.
నన్ను అర్జీ రాసేదానికి పిలిస్తే బ్రహ్మాండం.
నన్ను మా బావ సాఫ్ట్వేర్ ఇంజినీరు గా చెయ్యక ముందు మా ఊళ్ళోని తాలూకా ఆఫీసులో బ్రహ్మాండమైన చెట్టు కింద కూచోని అర్జీలు బ్రహ్మాండంగా రాసేవాడిని.
మా కుటుంబమంతా మీ ఇంటికి రమ్మంటే బ్రహ్మాండం.
ఎందుకంటే మా ఆవిడ సలహాలు ఇంకా బ్రహ్మాండం.
అన్నింటికీ మించి వైన్‌ వుంటే చాలా చాలా బ్రహ్మాండం.

ఇకుంటా
జై బ్రహ్మాండం. క్షమించాలి జై బియ్యం తల్లి....జై తెలుగు తల్లి. "

ఇన్ని బ్రహ్మాండాలున్నాయి పేరేంటో అని చూస్తే బ్రహ్మాండం భోజేశ్వర రావ్. అప్పుడు గుర్తొచ్చింది కార్గిల్ యుద్ధమప్పుడు డౌన్‌ టవున్‌ లో ధర్నా చేద్ధాం రమ్మంటే నేను బి.జె.పి.కి వ్యతిరేకం. ధర్నా చేస్తే వాళ్ళను సమర్థించినట్లుంది నేను రాను అన్నాడు. దీనికి రిప్లై ఆలస్యం చేయకుండా పంపించేశా.

"డియర్ బ్రహ్మాండం గారు,

మీ ఈ-మెయిల్ బ్రహ్మాండం.
మా ఇంట్లో వైన్‌ బ్రహ్మాండం లేదు.
మా ఇంట్లో అంతమంది పట్టడానికి మా ఇల్లు బ్రహ్మాండం కాదు.
బ్రహ్మాండమైన మీ రెవ్వరూ రావద్దు.
చర్చించిన విషయాల మీద ఓ బ్రహ్మాండమైన కాపీ తీసి ఫెడెక్స్ బ్రహ్మాండం లో మీ ఇంటికే పంపిస్తాం.

అభ్యర్థన: దయచేసి మీ రిప్లై బ్రహ్మాండం అని మళ్ళీ బ్రహ్మాండమైన రిప్లై ఇవ్వకండి.

ఇట్లు,
బ్రహ్మాండం బెండు లాంటి ఫ్రెండు."


(రెండో భాగం త్వరలో )

తరువాతి భాగం ఇక్కడ చదవండి

* * * *



గమనిక : ఈ టపాను ఒకే భాగంగా విడుదల చెయ్యాలని మొదట సంకల్పించాను. బుర్ర లోవారం రోజులు గా వున్న కాన్‌సెప్ట్ నిన్న డ్రాఫ్టు లో రాసుకున్నా. ఈ కాన్‌సెప్ట్ లో కొంత ఆంధ్ర జ్యోతి లో కార్టూన్‌ రూపము లో వచ్చేసింది. మిగిలిన ఇంకొంచెం సాక్షి లో రావడము ఇష్టము లేక వున్న దాన్ని రెండు భాగాలు చేసి విడుదల చేస్తున్నా.


* * * *