Saturday, April 28, 2007

2009 లో APPSC పరీక్షా పత్రం

పది ప్రశ్నలు ఒకే సమాధానం.

1. అంధ్రప్రదేశ్ లో ఎక్కువ మంది ధనికులు వున్న జిల్లా ఏది?

2. అంధ్రప్రదేశ్ లో ధనిక జిల్లా ఏది?

3. అయిదు సంవత్సరాల ముందువరకు సైకిల్ కూడా లేని వ్యక్తులందరూ స్కార్పియో లలో తిరుగుతున్న వాళ్ళు వున్న జిల్లా ఏది?

4. తమ ప్రాంతం లో కాకుండా జార్ఖండ్ వంటి ప్రాంతాలకు కూడా విస్తరించి ప్రాజెక్టు పనులు చేస్తున్న వారు వున్న జిల్లా ఏది?

5. 'అబ్బాయ్' వున్న జిల్లా ఏది?

6. ప్రాజెక్టు మొదలు పెట్టిన తొమ్మిది నెలల్లోనే రైతులకు నీళ్ళు అందించబడిన జిల్లా ఏది?

7. ఏ జిల్లా లో మెడికల్ కాలేజి కోసం వున్నపళంగా ప్రొఫెసర్లు, డాక్టర్లూ తరలించబడ్డారు?

8. ఏ జిల్లా పేరు చెబితే హైదరాబాద్ లో పనులు చక్క బడి పోతాయి?

9. ఏ జిల్లా వ్యక్తి వరసగా అయిదు సంవత్సాల పాటు కాంగ్రేసు ముఖ్య మంత్రి గా పనిచేశారు?

10. నేను ఈ జిల్లా వ్యక్తి నయుంటే ఈ పరీక్షలకు పెద్దగా చదువుకునే అవసరం లేదు అనుకుంటున్నార? అయితే ఆ జిల్లా పేరేంటి?


గమనిక: ఇది ఏ జిల్లా వారినీ కించపరచడానికి రాసినది కాదని మనవి చేసుకుంటున్నాను.

Thursday, April 26, 2007

భక్తుల మొర ఆలకిస్తాను కానీ.....

తలకోన అడవుల్లో కోతుల గుంపు సమావేశమయింది. అవి రెండు వర్గాలు గా చీలిపోయాయి. ఒకటి స్థానిక కోతులగుంపు ఇంకోటి తిరుమల కాందిశీకుల గుంపు.

స్థా.కో. గుంపు తి.కాం. గుంపు ని తిడుతున్నాయి. "మీరు రాక ముందు మాకు ఇక్కడ అన్నీ చక్కగా దొరికేవి వున్నంతలో హాయిగా తిని తల్లో పేన్లు(పేలు) చూసుకుంటూ చెట్లకు వేలాడు కుంటుండేవాళ్ళం. మీరొచ్చిన తరువాతే మాకు మేత దొరకడం కష్టమయిపోయింది"

తి.కో.గుంపు వాటికి సమాధాన మిస్తూ "మేము మీలాగా ఏది దొరికితే అది తినే టైపు కాదు. భక్తులు ఎక్కడెక్కడినుండో తెచ్చిన అరటి పళ్ళు, పులిహోర పట్లాలు, దద్ధోజనాలు తిని ఆరొగ్యంగా పిల్లా పాపలతో కాపురం చేసుకునే వారసులకు చెందిన వాళ్ళం. మేము చాలా నాగరికంగా బతికేవాళ్ళం. మీలా ఎక్కడ పడితే అక్కడ నిద్దర పోయే టైపు కాదు"

"చాలు చాల్లే సంబడం. ఎక్కడినుండో వచ్చి ఇక్కడ సెటిలయింది చాలక మళ్ళీ మా బతుకులు మంచివి కావి అంటారా? ముందు మిమ్మల్నిక్కడినుండి తరిమేస్తే కానీ మీకు బుద్ధి రాదు".

అంతలో తి.కా. గుంపు లోనుండి బాగ వయసు పైబడ్డ ముసలి కోతి రెండు పిల్ల కోతుల సాయంతో లేచి నిలబడి "ఆగండర్రా, మీరు కూడా ఇలా మనుషుళ్ళా పోట్లాడేసుకుంటే ఎలా? మనం మనిషిగా రూపాంతరం చెందే వయసు అప్పుడే వచ్చినట్టు ఇలా మాట్లాడు కోవడం ఏమీ బాగోలేదు."

స్థా.కో.గుంపు లో మాంచి పొగరు మీదున్న యువ కోతి మాట్లాడుతూ " ఏయ్! ముసలి కోతి నీకు తిరుపతి కొండ మీద తిన్న లడ్లూ, వడలూ ఇంకా అరిగినట్లు లేదు. మాకు నీతులు భోధిస్తావా? చూడు నిన్నేం చేస్తానో" అని మీదికి రాబోయింది. తాతల కాలం లో తి.కాం.కో. గుంపు తో సంబంధాలు కలిసి వున్న స్థా.కో. గుంపు లోని ముసలి కోతి "ఆగవే పిల్ల కోతీ, మనుషుల్లా మాట్లాడక కాస్త కోతిలా ప్రవర్తించు" అని గదమాయించింది. పోగరు కోతి కాస్త చల్ల బడింది.

తిరుమల నుండి వచ్చిన ముసలి కోతి చెప్పనారంభించింది.
"ఇరవై సంవత్సరాల క్రితం.. మేము ఇక్కడికెందుకు వచ్చామో ఏలా రాబడ్డామో వివరిస్తా. కాస్త ఓపిక తెచ్చుకుని వినండి. అప్పుడు నాకు ఒక సంవత్సరం వయసనుకుంటా......"


********* *******

తిరుమలలో వున్న 8 రేకుల షెడ్డు క్యూ కాంప్లెక్సులన్నీ వచ్చిన భక్తులతో కిట కిట లాడుతున్నాయి. అసలే ఎండా కాలం. చంటి పిల్లలు వేడికి తాళ లేక ఏడుస్తుంటే తల్లులు తమ చీర కొంగులే విసన కర్రలుగా చేసి విసురు తున్నారు. గుండు కొట్టించుకున్న కొంత మంది తండ్రులు తలకు చుట్టుకున్న తువ్వాళ్ళు తీసి పిల్లలకు, పెళ్ళాలకు విసనకర్ర లా వీస్తూ అప్పుడప్పుడూ చెమట పట్టిన గుండు తుడుచుకుంటున్నారు. షెడ్లన్నీ అరుపులు కేకలతో గుయ్యిమని శబ్దం చేస్తున్నాయి. ఒక షెడ్లోని గేటు తియ్యగానే మిగతా షెడ్లోని జనాలు ఆదరా బాదరగా లేచి బుడ్డోళ్ళని భుజాల మీదకి ఎత్తుకొని పరుగులు పెట్టడానికి తయారవుతున్నారు. అప్పుడే చెవులు కుట్టించుకున్న బుడిగిలు కాస్తా భే... అంటూ ఏడుపులంఖించు కుంటున్నారు.

అప్పటి వరకు షెడ్లోని పై కప్పులకే పరిమిత మయిన కోతుల గుంపులోని ఒక కోతి ఇదే సందుగా భావించి ఆ కదులుతున్న జనాల మీదకు పడి ఒక పల్లెటూరాయన చేతిలోని తువ్వాలు తీసుకుని పైకెగిరి ఆ ఇనుప కమ్మీల మీద కూచుంది. ఆ పల్లెటూరాయన తిట్లు అందుకున్నాడు "థూ..నీయవ్వ.. ఈ కోతులు..నిన్నేసేస్తా" అని స్థంభం పట్టుకుని ఎక్క బోయాడు.

అంతలో ఓ పెద్దావిడ అడ్డమొచ్చి "చూణ్ణాయనా, నువ్వు దాన్ని పట్టుకోలేవు గానీ, నీ సేతిలో వుండే అరిటి కాయిని దాని మిందకు ఇసిరెయ్ అబ్బుడు ఆ కోతి నీ టవలు కింద పడేస్తుంది" అని చెప్పింది. ఇదేం కిటుకు రా అని ఆ పల్లె టూరాయన చుట్టు పక్కల వున్న షెడ్లు చూశాడు. కొన్ని కోతుల చేతిలో టోపీలు, ఇంకొన్ని కోతుల చేతిలో టవళ్ళు, ఇంకొన్ని కోతుల దగ్గర విసన కర్రలు. పెద్దామె చెప్పింది కదా అని చేతిలో అరటి పండు ఆ కోతి మీదకు వెయ్యగానే టక్కున అరటి పండు పట్టుకొని టవల్ కింద పడేసింది. గుండు కనిపిస్తే కనిపిస్తుందిలెమ్మని ఆ టవల్ ని నడుముకు చుట్టుకున్నాడు ఈ సారి. అరటి పండు తిన్న వెంటనే వేరే బకరా కోసం ఇంకో షెడ్లోకి వెళ్ళి పోయింది ఏడాది వయస్సున్న ఆ కోతి. ఏమాటకామాటే చెప్పుకోవాలి. ఇలాంటి ఎక్స్చెంజ్ ఆఫర్లో నిజాయితీని చూసి కిడ్నాపర్లు ఎంతో నేర్చుకోవాలి.

అలా రోజూ భక్తుల దగ్గర నుండి ఏదో ఒకటి కిడ్నాప్ చేసి దానికి ప్రతిగా తమ పొట్ట (పొట్ట నిండాక దవడ దగ్గర స్టోర్ చేసుకునే సదుపాయం కూడా) నింపుకుని దిన దిన ప్రవర్ధమానం చెందుతున్న కోతుల బెడదని అరికట్టాలని తి.తి.దే.పాలక వర్గం నిర్ణయించింది. కొత్త క్యూ కాంప్లెక్స్ నిర్మాణానికి ముందే ఈ కోతులని తరిమేస్తే భక్తులకు సౌకర్యంగా(???) వుంటుందని కోతులను పట్టే వాళ్ళను తీసుకు వచ్చారు.

వాళ్ళు దొరికిన కోతిని దొరికినట్లు వ్యాన్లలో కుక్కేసి తిరుపతి చుట్టుపక్కల నున్న తల కోన, పెంచల కోన, భాకరాపేట అడవుల్లో వదిలేసి వచ్చారు.

********* *******

"అలా నన్నూ ఓ వ్యాన్లో కుక్కేసి ఇక్కడికి తీసుకు వచ్చి పడేశారు. ఇప్పుడు మీరు కూడా మమ్మల్ని వెళ్ళి పోమంటే మేమెక్కడికెళ్తాం." అని కంట తడి పెట్టుకుంది.

"భక్తులకు అసౌకర్య మౌతుందని మిమ్మల్ని ఇక్కడి పంపించేశారు కదా. మీరు ఇప్పుడూ ఆ వేంకటేశ్వర స్వామి దగ్గరకెళ్ళి మీరు ఇక్కడికి వచ్చినందుకు మాకు అసౌకర్యంగా వుందని చెప్పి ఏదయినా ఉపాయముంటే ఆయన్నే సెలవివ్వమని అడగండి" అని తీర్మానించింది స్థా.కో. గుంపు.

ఇక చేసేదేమీ లేక ఆ ముసలి కోతి ఇంకో మూడు కోతులను వెంట బెట్టుకుని వేంకటేశ్వర స్వామిని కలుద్దామని తిరుమల చేరుకుంది. క్యూ లైన్ననీ ఖాళీగా కనిపించాయి. అక్కడ గుడి ప్రాకారం తప్ప ఇంకేమీ గుర్తు పట్టలేక పోయింది. పెద్ద పెద్ద క్యూ కాంప్లెక్సులు, కొత్త కాటేజీలు ఎక్కడికో మారిపోయిన కళ్యాణ కట్ట, అందులో ఆడ క్షురకులు, కనిపించని వేయి స్థంభాల మంటపం ఇవన్నీ చూసి కళ్ళలో నీళ్ళు తిరిగాయి. తను చిన్నప్పుడు పరుగులు పెట్టిన రేకుల షెడ్డు లాంటిది ఒకటి కోనేటి దగ్గర కనిపించగానే కళ్ళ వెంబడి నీళ్ళు జల జల రాలాయి. ఆపసోపాలు పడుతూ ఎలాగోలా ఆ షెడ్డులో కి దూరింది. పాత ఆనవాళ్ళేమీ లేవు ఇప్పుడక్కడ. అలా అంతా పరికించి చూస్తుంటే షెడ్డు లోనుండి విమాన వేంకటేశ్వర స్వామి కనిపించగానే చేతులెత్తి దండం పెట్టింది.

అంతలో కింద ఎదో కల కలం మొదలయిందని చూస్తే తి.తి.దే. పని చేసే వాళ్ళు ఈ కోతుల వైపు చూస్తూ ఏదో అరుస్తున్నారు. అప్పుడర్థమయింది తమని తరమడానికి వెంట పడుతున్నారని. మిగతా మూడు కోతులతో కలిసి షెడ్డు పైకప్పు మీదకు ఎక్కి గుడి మహాద్వారం దగ్గర నున్న సహస్ర
దీపారాధన భవనం వెనక నక్కి కూచున్నాయి. మళ్ళీ ఏదో అలికిడి అయితే లేచి చూసింది. ఈ సారి తమని తరమట్లేదు, పోలీసులు గుడి ముందున్న జనాలని లాఠీ చార్జ్ చేసి నెట్టి వేస్తున్నారు.

గుడి ముందు లాఠీ చార్జేమిటి అని అలోచిస్తూ వుండగా గమనించింది. అభిషేక్ బచ్చన్, తన సతీమణి ఐశ్వర బచ్చన్, అమితాబ్ బచ్చన్, అనిల్ అంబాని, అమర్ సింగ్ అందరూ మహాద్వారం గుండా లోపలికెళ్తున్నారు. క్యూ లైన్లన్నీ ఖాళీగ వుండటానికి కారణం అప్పుడర్థమయింది
మన అన్న ఎన్టీయార్ వున్నప్పుడు ముఖ్యమంత్రి, ప్రధాన మంత్రి, రాష్ట్రపతి, గవర్నర్ తప్ప ఎవ్వరూ నేరుగా గుడిలోకి వెళ్ళ కూడదని శాశనం చేశాడు కానీ ఎవ్వరూ పాటించడం లేదు అనుకుంది. ఓ రెండు గంటలయి పోయాక వాళ్ళు చేతులూపుకుంటూ బయటికి వచ్చి వెళ్ళి పోయారు.

పగలు వెళితే ఎవరైనా చూస్తారు అని రాత్రి వెళ్ళి దేవుణ్ణి కలుద్దాం అని నిర్ణయించాయి నాలుగు కోతులు కలిసి. అది కూడా గుడీ తలుపులు మూసి వేశాక అని అనుకున్నాయి. రాత్రి ఒంటి గంటప్పుడు చప్పుడు చేయకుండా గుడి ప్రాకారాన్ని దాటి గర్భ గుడిలోకి ప్రవేశిస్తూ వుండగా ఏవో మాటలు వినిపిస్తే బయటే ఆగి పోయాయి.

"అదేమిటి స్వామీ మీ భక్తులకు అంతగా ఇబ్బంది కలుగచేస్తూ ఈ ముఖానికి రంగు వేసుకునే వాళ్ళకు గంటలకు గంటలు దర్శనమిస్తున్నారు. ఆ సమయాన్ని ఎన్నో వ్యయ ప్రయాసల కోర్చి మీ దర్శనానికొచ్చిన సామాన్య భక్తులకు కేటాయించొచ్చు కదా?" అడుగుతోంది పద్మావతీ దేవి.

"ఏం చెయ్యమంటావు దేవీ, వీళ్ళు రావడానికి ఓ వారం రోజుల ముందే అనిల్ అంబానీ, అమర్ సింగ్ వాళ్ళ వాళ్ళు వచ్చి నా హుండీ తలో 51 లక్షలు వేశారు" సమాధాన మిస్తున్నాడు శ్రీ వేంకటేశ్వర స్వామి.

"అంటే డబ్బులు ఇచ్చిన వారి పక్షమా మీరు?"

"అలా కొప్పడకు దేవీ నీకు తెలుసు కదా మన పెళ్ళికి డబ్బెంత ఖర్చయిందో"

"వాళ్ళు డబ్బులిస్తే మిగతా వాళ్ళను అలా పడిగాపులు కాయిస్తారా?"

"ఆ..ఆ..అలా కాదు సామాన్య భక్తులు వేచి వుండటం లో ఆనందముందని భావిస్తారు. అందుకే వాళ్ళకు ఇంకొంత ఆనందాని ప్రసాదిస్తున్నాను."

"ఇలా చేస్తున్నందుకు మీకు అపవాదు లొస్తాయని తెలీదా నాదా?"

"అపవాదులు నాకు కాదు. ఈ పాలక మండలి వాళ్ళకి. అప్పుడే ఒక విచారణ కమిటీ కూడా వేశారు ఎందుకు అలా ఒక గంట సేపు సమయాన్ని వాళ్ళకు ఇచ్చావు అని. ఇప్పుడు ఇందులో పాలు పంచుకున్న వాళ్ళందరిని కాపాడటం కూడా నా బాధ్యతే".

"అంటే మీరు సామాన్యుల మొర ఆలకించరా?"

"ఆలకిస్తాను కానీ....."

ఇవన్నీ బయటి నుండి విన్న పండు కోతికి అర్థమయి పోయింది తన విన్నపాలు ఆలకించే స్థితిలో స్వామి లేడని. తన తిప్పలేవో తనే పడుకోవాలి అని మిగతా కోతులతో కలిసి తిరుగు ప్రయాణ మయింది తలకోన అడవులకు.

Tuesday, April 17, 2007

"మాండలే బే" లో "ఖైదీ నంబరు 300"




లాస్ వేగాస్ లోని "సీజెర్ ప్యాలెస్","బెల్లాజియో","ట్రాపికానా" కేసినో ల వాళ్ళు వాళ్ళ గోడలకు, గేట్లకు కొన్ని రిపైర్లు వుండాయి వాటి కోసం విరాళాలు ఇచ్చేవాళ్ళు కావాలి అని మా కంపెనీ వాళ్ళను అడుక్కోవడం వల్ల మా వాళ్ళు నన్ను అడుక్కొని లాస్ వేగాస్ కెళ్ళి కొన్ని విరాళాలు ప్రకటించి రా అని చెప్పారు.అందువల్ల నేను లాస్ వేగాస్ రావడం జరిగింది. పేరులోనే వుంది "లాసు" గమనించగలరు. ఒరకిల్ కాన్ఫరెన్స్ వుంది అని మభ్య పెట్టి నన్ను పంపేశారు.

ధర్మ రాజు ఎక్కువ పూనడం వల్ల టైమంతా జూదమాడ్డానికే అయిపోతుంది ఇలా అయితే నేను బ్లాగేదెలా? అని ఆలోచిస్తే పొద్దు వాళ్ళు చెప్పిన కాపీ రైట్లు గుర్తొచ్చాయి. ఓ పక్షం రోజులు ఆగితే వాళ్ళ వ్యాసాలు వాళ్ళ బ్లాగులో పెట్టుకోవచ్చు అని. నేను పొద్దు అతిథి కోసం బరికిన వ్యాసముంది దాన్ని యథాతదంగా దింపేస్తే పోలా అని అవుడియా వచ్చింది. అసలే నేను చాలా తెలివయినోడిని. (ఎంత తెలివంటే నేను వేగాస్ లో మిలియెన్లు విరాళాలు ఇవ్వడం లేదు. కేవలం వందలు మాత్రమే ఇస్తున్నాను. "అబ్బో.." ఆనందం తో బాబూ మోహన్ లాగా గుటకేస్తున్నా) ఇదిగో పొద్దు కోసం నేను రాసిన వ్యాసం కింద ఇస్తున్నా.

అసలు నన్ను పొద్దు వాళ్ళు అతిథి గా పెట్టడమేమిటి అని అనుమానమొస్తే ఒక ఆకాశ రామన్న ఉత్తరం వాళ్ళకు రాసుకోండి.వాళ్ళు చానా మంచోళ్ళు కాబట్టే నన్ను మంచోడని సర్టిఫికేటిచ్చారు. అంటే నాకో పేద్ద ముద్దర ఏశారన్నమాట. వాళ్ళదగ్గర మంచిని కొలిచే "మంచో మీటరు" వుంది. కాపీరైట్లు త్రివిక్రం కు ఇచ్చేరనుకుంటా.

అప్పుడెప్పుడో స్కూల్లో చదువుకునేప్పుడు "మాండలే జైలులో" అని ఒక పాఠం వుండేది. ఆ మాండలే జైలులో బాల గంగాధర్ తిలక్ ను పెడితే అక్కడ కూచుని కొన్ని పుస్తకాలు రాశాడట. ఇప్పుడు ఈ భూపతి గగన విహారి తిలక్ ప్రస్తుతానికి "మాండలే బే" లో కూచుని బ్లాగు రాస్తున్నాడు. ఎవరికన్నా తిలక్ ఏంటి అని లాజిక్కొచ్చెన్ వస్తే, తొట్టెంపూడి వేణు లాగా నా సమాధానం....ఇంట్లో మొన్న బేబీ పండు అన్నప్రాశనతో పాటు సత్యనారాయణ పూజ జరిగితే తిలకం పెట్టుకొచ్చా. మాండలే అంటే ఏమిటి అని అడిగితే ఎవరూ చెప్పట్లేదు. "మాండలే జైలులో" పాఠం గుర్తు చేస్తే "అదేంది" అంటున్నారు నేను చదువున్న సిలబస్సే చదివిన తెలుగు సోదరులు. "మాండలే బే" అన్నది ఒక హోటల్ పేరు. అసలు వేగాస్ అంటే ఏంటి తరువాతి టపా లో రాస్తా అంతవరకు ఈ బ్లాగు ఖైదీ నంబరు 300 చదవండి.
:
:
:
:

వారి(పొద్దు) సొల్లు:

ఈ నెల మా అతిథి - బ్లాగు విహాయస విహారి, దోనిపర్తి భూపతి విహారి. ఈయన బ్లాగు చిక్కటి హాస్యానికి ఓ చక్కటి మజిలీ. కొలరాడో తెలుగు సంఘంలో సాంస్కృతిక కార్యదర్శిగా చురుకైన పాత్ర పోషిస్తున్నారు. బుడిబుడి అడుగుల నుండి వడివడి నడకల దాకా తన బ్లాగు ప్రస్థానం ఎలా సాగిందో చెబుతున్నారీ ఆత్మకథా విహారి. ఆలకించండి.

————-

విహారి సొల్లు

పోయిన ఆగస్టు నెలలో అనుకుంటా గూగుల్లో తెలుగు గురించి కాస్త వెతుకుతుంటే తెలుగు బ్లాగర్ల గుంపు పేరు కనపడింది. ‘ఆహా, ఏదో తోక దొరికింది. దాన్ని పట్టుకుని వెళితే మంచి తెలుగు మేత దొరుకుతుంది’ అని దాన్ని వెంబడించాను. అది తీసుకెళ్ళి తెలుగు కోసం తపన పడుతున్న కొంత మంది వున్న గుంపులో పడేసింది. ‘మన తెలుగు కోసం ఓ బ్లాగర్ల గుంపు కూడా వుందా?’ అనుకొని, ‘ఇంకొంచెం తవ్వితే ఇంకెన్ని వుంటాయో?’ అని పలుగు, పార ఎత్తుకొని తవ్వితే తెలుగు సాహిత్యం అంటూ ఇంకో గుంపు పలుగుకి తగిలింది. దాన్ని పట్టుకెళ్ళి నాకిష్టమైన గుంపు పెట్టెలో పెట్టేశా. తవ్వుతున్న కొద్దీ “తెలుగు మిత్ర”, “ఫ్రెండ్స్ ఫ్రం ఆంధ్రా” లాంటివి తగిలాయి. అన్నీ తీసుకెళ్ళి నా పెట్టెలో పెట్టేశా.


‘అన్నీ పెట్టెలో పెట్టుకుంటే ఏం లాభం? వాటిని కాస్త వాడుకోవాలి’ అని మొదట తెలుగు బ్లాగర్ల గుంపులో ఓ చెయ్యి పెట్టా. పెట్టిన తరువాత నా చెయ్యిమీద “ధభేల్” మని ఓ ముద్రేశారు. ఏంటా అని చూస్తే చేతిమీదో నంబరు …..నంబరు 300. అంటే నేను మూడువందల నంబరు ఖైదీ నన్నమాట (ఖైదీ నని ఎందుకన్నానో తరువాత చెబుతా). ఇక ఎటూ నంబరొచ్చేసింది కదా ఎదో ఒకటి చేద్దామని జెండా పండగ నాడు రాజకీయ నాయకులకు గాంధీ గుర్తొచ్చినట్టు అప్పుడప్పుడూ లింగు లిటుక్కుమని అందులో “నేను వున్నాను” అని కేకలు పెట్టే వాడిని. ఆ కేకలు విని తోటి సభ్యులు “నీకు రెక్కలొచ్చాయ్ వెళ్ళి నీ గూడు కట్టుకో”, అన్నట్టు “నీకు కేకలు పెట్టడం బాగానే వచ్చు. వెళ్ళి నీ బ్లాగులో పెట్టుకో. ఇది నీ ఇంటిముందు మర్రి చెట్టు కాదు నీ వాగుడు వింటానికి” అన్నారు.


“మీరు బ్లాగు పెట్టుకోమంటే పెట్టేసుకుంటానా? నేను సెలెబ్రిటీనే కాదు లెజెండ్ లా బ్లాగెలా పెట్టుకుంటా?” అని నోటి నాలుకకు (కాల నాళికలా అనిపిస్తే మీరు సినిమా వజ్రోత్సవాలను బాగా ఫాలో అయ్యారని అర్థం) తాళం వేసి కొన్నాళ్ళు బ్లాగు పరిశోధన చేశా. అప్పుడప్పుడూ, ఎవరి బ్లాగుల్లో వాళ్ళు పెడుతున్న కేకలు చూసి నేను కూడా “పొలి కేక”, “గావు కేక” పెట్టుకుంటూ బ్లాగుల్లో కామెంట్స్ రాయడం మొదలు పెట్టా. ఎక్కువగా రాజకీయాల మీద, బాష మీద, తెలంగాణా మీద, రిజర్వేషన్ల మీద రాసిన వ్యాసాలు బాగా ఆకర్షించేవి. వాటికి నా సమాధానం “డింగో డింగు” అంటూ ఇచ్చేవాడిని. అప్పట్లో నాకు తెలిసిన బ్లాగుల పందిరి కూడలి, తెలుగు బ్లాగర్స్ వుండేవి. వాటిని సందు దొరికినప్పుడల్లా కొత్త బ్లాగుల కోసం “ఫ్రెష్ కావే..ఫ్రెష్ కావే” అని ఎలుక తోక తో కొట్టే వాడిని. పాపం ఎలుక అలిసి పోయేదే కానీ కొత్తవి అంత తొందరగా వచ్చేవి కాదు. ఇప్పుడయితే ఆ ఎలుక ముదిరిపోయిన వీధి రౌడీలాగా నిర్లక్ష్యంగా “ఏ! ఇప్పుడొస్తున్న బ్లాగులు చాలవూ? ఒక్క రిఫ్రెష్ కే ఇన్ని వస్తున్నాయ్ వెళ్ళి వాటి సంగతి చూసి రా, మాటి మాటికి నా జోలికి వస్తే నా ఓనర్ విఘ్నరాజు కు చెప్పి నీ తాట తీయిస్తా” అని బెదిరిస్తోంది.


కొన్నాళ్ళకు “ఝుమ్మంది నాదం..బ్లాగంది పాదం” , “నన్ను ఎవరో చిలికిరి..కలికిరి..కెలికిరి…బ్లాగులోని మత్తు మందు చల్లిరి” , “పరువమా బ్లాగు పరుగు తీయవే..” లాంటి సందేశాలు అశరీరవాణి వినిపించడం మొదలు పెట్టింది. అంటే నాకు ఇక బ్లాగులు రాసే వయసొచ్చేసింది అన్నమాట. ఇంకేం కొత్త కాపురం, “ఇదీ నా మది” అని ఓ బ్లాగుకు ఓపెనింగ్ సెరెమనీ చేసేసి బ్లాగుల గుంపులో పెట్టేసి, కూడలి లో పెట్టమని వీవెన్ కో లేఖ, తెలుగు బ్లాగర్లో పెట్టమని చందూకో లేఖ పెట్టేశా. ఎప్పుడో రాసుకున్న, రాజుకున్న కొన్ని కవితల్ని అందులో పెట్టేసి చేపల కోసం వల వేసిన జాలరి ఎదురు చూసినట్టు కామెంట్ల కోసం ఎదురు చూడ్డం మొదలయింది. ఒక్కొక్కరు ఒక్కోరకంగా సమాధానం రాయడం మొదలయింది. బాగా నచ్చిన కామెంట్లను నాలుగయిదు సార్లు చదువుకుని కిత కితలు పెట్టుకునేవాడిని. ‘ఇక ఇలా కాదు నాకు తెలిసిన వన్నీ బ్లాగెయ్యాలి’ అని ఇంకో బ్లాగు “నాటకాలు” అని మొదలు పెట్టా. అందులో రెండు టపాలకంటే ఎక్కువ రాయడానికి కుదర్లేదు. మామూలుగా మూడంకె వేసి బజ్జుంటారు. కానీ నేను మాత్రం రెండంకె వేసి గుర్రెట్టా. కొన్నాళ్ళు బండిని లూప్ లైన్లో పార్క్ చేసి వచ్చే పొయ్యే బ్లాగు రైళ్ళను మళ్ళీ చూడ్డం మొదలయింది. కొన్ని ఎక్స్ ప్రెస్ రైళ్ళు బాగా ఆకట్టుకున్నాయి. నేనూ అలా రాద్దామని ప్రయత్నించా. మన బొగ్గింజనుకు అంత సీను లేదు అని తెలిసింది. సరేలే ఎక్కడ బడితే అక్కడ ఆగిపోయే “దొంగల బండి” లా ఎందుకు తయారవకూడదు? కిందా మీద పడి, దీర్ఘంగా హ్రస్వంగా, లోపలికి బయటకి, భూమ్మీదా మేఘాల మీద (కార్లో స్పీడుగా అని) అలోచించి..చించి మెదడుకు చిల్లు పెట్టుకుని ఎక్కడెక్కడో వన విహారం, జల విహారం, వాయు విహారం చేసి బ్లాగుకో నామధేయం నా పేరులోనుండే “విహారి” అని పెట్టేశాను. ఇక విహరించడం మొదలయింది.


అలా నేను విహరిస్తూ వుండగా…వుండగా ఈ బ్లాగర్లు ఎప్పుడూ అలుపూ సొలుపూ లేకుండా పొద్దూ పాడూ తెలీకుండా బ్లాగేస్తున్నారు.వీళ్ళకు కొంచెం పొద్దులు తెలియ చేసి బ్లాగులంటే ఇలా వుండాలి అని తెలియ చెప్పడానికి ఓ “పొద్దు” పొడుచుకొచ్చింది. అందరి మన్ననలు పొందుతూ దూసుకు పోతోంది.అలా తెల తెల వారుతున్నట్లు రోజు పొద్దు పొడుస్తూ సద్దుమణుగుతూ వుండగా ఋతువులు మారాయి. వసంతమొచ్చింది. వికసించే పుష్పాలెక్కువయ్యాయి తేనెటీగల సరాగాలు తోడయ్యాయి. అలాంటి తేనెటీగల కోసం తమిళంలో వున్న “తెన్ కూడు” తెలుగులో కూడా “తేనె గూడు” లా వెలిసింది. ఉచితంగా బాజా వాయించే వాళ్ళుంటే పెళ్ళికి సిద్ధం అన్నట్లు అన్ని బ్లాగు తేనెటీగలు అక్కడ కూడా వాలి మకరందాన్ని చేరుస్తున్నాయి. ఇవన్నీ చూసి శ్రీ కృష్ణ దేవరాయలు “ఏను తెలుగు వల్లభుండ..” అని గర్జిస్తే దేశంలోని పండితులు అందరూ వినమ్రంగా నిలబడి రండి “వైద్య కవి గారూ”(సూదేస్తాని బెదిరించాడ్లే..కత్తుల్లేవుగా) అని తెలుగు పెత్తనమిచ్చి తెలుగు గుబాళింపులు దేశీ పండిట్ లో విరజిమ్మాలని ఆహ్వానించారు. మన తెలుగు బ్లాగర్ల ప్రపంచంలో ఇదొక అధ్యాయం.


టపాలు రాసే కొత్తలో ప్రతి దానికి ఉత్సాహపడి పోవటం. టపా రాసిన వెంటనే వాటికి కామెంట్లు వచ్చాయేమోనని ఆత్రంగా చూడ్డం. ఒక్క కామెంటు వచ్చినా వంద సార్లు చదువుకుని కొత్తవున్నాయేమో అని ఎలుక ఎడమ ముక్కుని చావబాదటం. కొన్ని ఎక్కువగా రాగానే చొక్క గుండీలు తీసేసి లుంగీ ఎగ్గట్టి “ఎస్..నేనే నంబెర్ వన్” అని ఎన్టీఆర్ పాట పాడేసుకోవడం (మగ వాళ్ళయితే). ఆడవాళ్ళయితే కొప్పు ముడేసి కొడవలికి సాన పెట్టి “లేచింది..నిద్ర లేచింది మహిళా లోకం” అని పాడేసుకోవడం. ఆ ఉత్సాహంలో ఇంకో టపా దాని నెత్తి మీద రాయటం అందరికీ అనుభవంలో కొచ్చే విషయాలు.


అనుభవంలోకి వచ్చే ఇంకో విషయం. మొగుళ్ళు పెళ్ళాలను గుర్రుమని చూడ్డం. పెళ్ళాలని మొగుళ్ళు గుర్రుమని చూడ్డం. పెళ్ళి కాని వాళ్ళను వాళ్ళ ఫ్రెండ్స్ వదిలేసి సినిమాలకు వెళ్ళి పోవడం. ఎందుకంటే బ్లాగొక వ్యసనం. ఎవరో చెప్పినట్టు ఇది “మధుర వ్యసనం”. కాకపోతే జలగ లాగ ఓ పట్టాన వదలదు. బాగా అతుక్కు పోయిన వాళ్ళను “బ్లాగ్ జలగ” అంటారు. ఎవరో ఎక్కడో అన్నారు “బ్లాగిలం” అని కూడా. ఇది ఎంతగా చుట్టేస్తుందంటే ఆఫీసు నుండి ఇంటికెళ్ళే ముందు ఓ సారి కూడలిని రౌండేసి వస్తే కానీ తృప్తి వుండది. అలాగే ఇంటికెళ్ళగానే లాప్టాప్ లో పొద్దున తెరిచి వుంచిన కూడలిని ఓ సారి ఓ F5 (refresh button) అంటే గానీ మనసూరుకోదు. (ఓ F5 అనగానే ముళ్ళపూడి వారి అప్పారావు డైలాగు -”ఓ ఫైవుంటే ఇస్తావూ” గుర్తొస్తోందా?) అందరూ బ్లాగులకు ఖైదు అయిపోతారు. అందుకే అన్నా “ఖైదీ” అని. నేను ఖైదీ నంబరు 300.


ఇంకో రెండు మూడేళ్ళకు ఓ పెళ్ళయిన జంట మన ముందుకొచ్చి “ఆ బ్లాగులో ఆయన టపా చూసి నేను పడిపోయా” అని ఆవిడ,
“ఆ టపాకు ఈ సమాధానం చూసి ఈవిడను నేను లేపా” అని ఆయన చెప్పే రోజులు. తమ బ్లాగు ప్రేమ కథలు చెప్పి “ఈ బ్లాగు మమ్మల్ని కలిపింది కాబట్టి మా బుడ్డోడు/బుడ్డిది పుట్టిన రోజు సందర్భంగా ఈ బ్లాగుల సంఘానికి ఓ వెయ్యిన్నూటపదార్లో లేక లక్షా నూటపదార్లో ఇస్తాం” అని చెప్పే రోజులు వస్తాయి. (బ్రహ్మచార్లూ గాల్లో రింగులు రింగులు వేసుకొని విహరిస్తున్నారా…కాస్త ఆగండి)


తెలుగు బ్లాగర్లు ఇప్పుడు అయిదొందలు దాటారు. బ్లాగులేమో ఓ మూడొందలు వున్నాయి. రాసే టపాలు లెక్కకు మిక్కిలిగా వుంటున్నాయి. ఇప్పుడు చదివిన టపాలకు ఎంత బాగున్నా కామెంట్లు రాసే వాళ్ళు కూడా తగ్గిపోతున్నారు. భ్లాగులను ఓ పళ్ళ తోటతో పొలిస్తే, రెండు నెలల క్రితం వరకు ఏ చెట్టు ఎక్కడుందో ఏ పండు ఎక్కడుందో ఏ చెట్టుకు ఎలాంటి కాయలు కాసేవో తెలిసేది. ప్రతి చెట్టూ, దాని పుట్టు పూర్వోత్తరాలూ తెలిసేవి. ఇప్పుడు ఇలాంటి ఫలాలను అందించే బ్లాగులు ఎక్కువయి పోయాయి. ఎన్ని ఆరగించాలో ఎలా అరిగించుకోవాలో తెలియడం లేదు. ఒకరికొకరు పోటీగా రాసేస్తున్నారు. ఇంతగా మన “తెలుగులు (తెలుగు వాళ్ళు)” లాగుతున్నారంటే దానర్థం మన తెలుగుకు మంచి రోజులు వున్నట్టే.


ఇక్కడ నాకు ఇరవై ఏళ్ళ క్రితం చదివిన జోకు గుర్తుకు వస్తోంది.
“సిడ్నీ షెల్టాన్ తెలుగు నేర్చుకుంటే ఎలా ఫీలవుతాడు”
“తెలుగు లో నేనిన్ని కథలు ఎప్పుడు రాశానబ్బా” అని ఆశ్చర్య పోతాడు.

కాపీ అయితే నేమి, సృజనాత్మకత అయితే నేమి, సాహిత్య పరిశోధన అయితేనేమి తెలుగులో రాసే వాళ్ళు కొల్లలుగా పుట్టుకు వస్తున్నారు ఈ పరుగులు పెట్టే ఆధునిక జీవితంలో.

ఓం బ్లాగ్వ్యసనం ప్రాప్తిరస్తు !!!

-----

Saturday, April 14, 2007

ధ.దే.ఈ.శు.- "వీజీ డైలాగులు"

అవినీతి బంధు ప్రీతి పై అన్యాయాన్ని ఎదిరించండి
--విద్యార్థులకు కేశవ రావు పిలుపు.
అంబుజా లీజు, డీపెప్, నాదర్ గుల్ భూములపై మెజిస్టీరియల్ విచారణ
-- వై.యెస్.
టి.ఆర్.యెస్. పై వై.యెస్. కుట్ర
-- నరేంద్ర
ఎవడ్రా వాడు లంచ మడిగింది చెమ్డాలొలిచేస్తా
-- జె.సి.దీవాకర్ రెడ్డి

Thursday, April 12, 2007

నా ఏడో తరగతి మొట్టికాయలు

ఈ మధ్యెందుకో మొట్టికాయల మీదకి వెళ్ళింది ధ్యాస. మొట్టి కాయలంటే రాయలసీమ ప్రాంతంలో వాడుకలో వుండే 'గోరు చిక్కుడు ' కాయలు కాదు. బుర్ర కాయల మీద మేస్టారు కాయలు, ఇతర తోటి పిల్ల కాయలు వేసే మొట్టికాయలన్నమాట. ఇంకా గుర్తుకు రావాలంటే "పరమానందయ్య శిష్యుల కథ" సినిమా చూడాల్సిందే. అందులో లెంప కాయ, జెల్లి కాయ, డిప్ప కాయ, కొత్తెం అంటూ దాని మీద చిన్నప్పుడు బాగా రీసెర్చ్ చేసిన ఒక పెద్దాయన రాసినట్టున్నాడు. ఎంతయినా అనుభవ రీత్యా రాసిన విషయాలు చాలా చక్కగా పేలుతాయి.

ఇప్పుడు నా మొట్టికాయల సంగతి చెప్పుకుందాం. ఆరో తరగతి లో వున్నప్పుడు మొదలయింది హిందీ అక్షరా భ్యాసం. అప్పట్లో మాకో హిందీ పండిట్ వుండే వాడు ఆయన క్లాసులో 'నిశ్శబ్దం' మీద పెట్టినంత శ్రధ్ధ హిందీ పాఠాల మీద పెట్టే వాడు కాదు. ఆయన క్లాసులో కొచ్చాడంటే "పేనా లో ఇంకు గూడా కదిలేది కాదు" ఏంటా ఉపమానమనకండి నా బుర్రలోకి ఏదొస్తే అది రాసేస్తా."నాకు ఇక్కడ ఏదనిపిస్తే అది చేస్తా...ఇక్కడ ఎలా అనిపిస్తే అలా మాట్లాడుతా" అంటూ "చిరునవ్వు తో" సినిమాలో తొట్టెం పూడి వేణు డవులాగులా అనిపిస్తే అది ఆ రచయిత నానుండి కాపీ కొట్టాడని అర్థం చేసుకోవాలి. నేనతనిని హృదయ పూర్వకంగా క్షమించేశా.

అసలీ ప్రపంచంలో కాపీ కొట్టని వాడు ఎవడు. తెలుగు లో వున్న వన్నీ మన అచ్చులు, హల్లులు, గుణింతాలకు కాపీలు కాదా? ఆంగ్లంలో వున్న వన్నీ ఓ 26 అక్షరాలకు కాపీలు కాదా? అరె నాకు ఈ లాజిక్ ఇంత వరకు తట్టలేదు ఉద్యోగం పోతే లాయరు ప్రాక్టీసు పెడతా. ఇది చదివిన వాళ్ళందరూ నా క్లయింట్లే. కామెంట్లు రాస్తే డిస్కౌంట్ ఇస్తా. బండి పక్క దారిలో కెళ్ళింది. మెయిన్ రోడ్డులో కొచ్చేస్తా.

ఇందాక పెన్ను ఇంకూ అదేదో చెప్పాగా అలాగ ఎప్పుడూ సైలెంట్ గా వుండాలి ఆయను క్లాసులో వున్నా లేక పోయినా. ఆయన గారికి ఓ రోజు మూడొచ్చి అందర్నీ ఓ మూడు రూపాయలు పట్టుకొని రండి "ఆరో తరగతి వెధవల్లారా" అంటే ఆరున్నొక్క రాగం లో అరిస్తే కానీ ఇంట్లో నుండి ఆరూ డీవైడెడ్ బై రెండు జేబులోకి రాలేదు. ఎందుకంటే ఆ మూడు రూపాయలూ అదేదో హిందీ బుక్కు కొనటానికట. అప్పటికే టెక్స్ట్ బుక్కుల కోసం డబ్బులు ఖర్చుపెట్టిన అమ్మా నాన్నా మళ్ళీ డబ్బులు ఎందుకిస్తారు. అందుకన్నమాట ఆ రాగం. సరేలే అని ఇచ్చిన ఆ మూడు రూపాయలూ చెడ్డీ జేబులో పెట్టుకుని దీనా బంకు దగ్గరకు రాగానే కాళ్ళు ఆగిపోయాయి. ఆ మూడు రూపాయల్తో చానా ఎక్కువ పాల్కోవాలు, గుల్కన్ లు, రసగుల్లాలు, కమ్మర కట్లు, కేకులూ వస్తాయి మరి. జేబులో చెయ్యి పెట్టి మూడు రూపాయల మీద చెయ్యి వెయ్యగానే దాని చుట్టూ సెక్యూరిటీ గార్డు లా వున్న "వీపు విమానం మోత" ఓ గిల్లుడు గిల్లింది చూపుడు వేలు మీద. అ గిల్లుడుకి కమ్మరకట్లు, పాల్కోవాలు మాయ మయిపోయి కళ్ళద్దాల హిందీ అయ్యవారు, పహిల్వాన్ రొయ్య మీసాలు కనపడ్డాయి. ఆ మరుక్షణం నా చెడ్డీ లోని మూడు రూపాయలు పాంటులోని ఎన్నో మూడు రూపాయల్తో కలిసి పోయాయి.

ఓ మూడు రోజుల తరువాత ముప్పై పేజీల హిందీ బుక్కు టెక్స్ట్ బుక్స్ తో జత కట్టింది. "రొయ్య మీసాల మాస్టారు" వచ్చినప్పుడల్లా అది బయటికొచ్చి మొదటి పేజీ తెరుచుకొనేది. అందులో నేను ఇప్పటి వరకూ నేర్చుకొన్నది "ఇంలీ, ఈక్". అ, ఆ లకు ఏముందో నాకు తెలీదు. ఎప్పుడొచ్చినా ఆ ఇ, ఈ ల "ఇంలీ, ఈక్" అని చదివిచ్చేవాడు.

అంతా "బ్రహ్మా నంద రెడ్డి" స్కీం మహత్యం పరీక్షల్లో సున్నా వచ్చినా పై తరగతి కి ఉయ్యాలేసుకుని ఊక్కుంటూ వెళ్ళి పోవచ్చు. నేను నా తోటి విద్యార్థులందరూ "ఇంలీ..ఈక్.....ఇంలీ.. ఈక్" అనుకుంటూ ఏడో తరగతి లో కెళ్ళి పోయాం. ఆరు లో రెండు సెక్షన్స్ A,B అని వుండేటివి ఏడులో కొచ్చేసరికి దాన్ని మూడు చేసేశారు. మరి ఏడంటే పబ్లిక్ పరీక్షలుంటాయి "ఇంలీ ఈక్" అంటే కుదరక్కడ. అలా కుదర లేనోళ్ళందరూ మరింత దీక్షగా చదవాలనే ఉద్ధేశ్యం తో అదే క్లాసును నాలుగయిదు సార్లు చదివి తృప్తి చెందాకా ఎనిమిదికి వెళ్ళే వారు. అలా తృప్తి చెందక మనసును మరింత లగ్నం పెట్టాలనుకునే వాళ్ళు ఎక్కువవడం వల్ల ఎక్కువ సెక్షన్స్ చేసారు.రెండును మూడెలా చెయ్యాలి అని మేస్టార్లందరూ కలిసి 120/3 చేసుకుని సెక్షన్ కు 40 అన్నారు. అంతవరకు బాగానే వుంది తరువాత మొదలయింది క్లాసు టీచర్ల "చొక్కా గుండీలు పీక్కునే కార్యక్రమం" నాక్లాసులో బ్రైట్ స్టూడెంట్స్ లేరంటే లేరని ఓ ఇరవై గుండీలు కింద పడ్డాక "కనీసం నాకు వీడిని ఇవ్వండి" అని ఎక్కువ చొక్కా గుండీలు పీకిన మాస్టారు లాగడం వల్ల నేను వెళ్ళి B సెక్షన్ లో పడ్డా. నా జిగిరీలందరూ A లో కెళ్ళి పోయారు. ఏం చేద్దాం అని ఏడ్చుకుంటూ బుక్కుల మీద ఏడు B అని రాసుకుని B సెక్షన్ లో కూచున్నా.

మొత్తం సెక్షన్ లో ఏవడికి ఏ డవుటొచ్చినా "నువ్వు చెప్పుబ్బా" అని వచ్చేవాళ్ళు ఒక్క హిందీ దగ్గర తప్ప. హిందీ కోసం బాగా జిగిరీలయిన గులాం వలీ, కుమార్ గాళ్ళు మాత్రం వచ్చేవాళ్ళు నాకు ఆత్మ విశ్వాసం నింపడానికి. మన బతుకంతా "ఇంలీ ఈక్" అయిపాయె ఆరో తరగతి లో. దానికి తోడు ఆ సంవత్సరం "బుర్ర మీసాల మాస్టారు" రాలేదు. ఇంతకు ముందు రొయ్యన్నావ్ ఇప్పుడు బుర్రన్నావ్ ఏంటది అని అడక్కండి తొట్టెం పూడి వేణు డవిలాగ్ గుర్తు తెచ్చుకోండి. "ఇంలీ ఈక్" అంటే ఏడు లో పాసు కారని స్ట్రిక్ట్ గా వుండే ధనమ్మ మేడం ను ఏశారు ఏడో క్లాసుకి. అక్కడే "సీతమ్మ కష్టాలు" మొదలయ్యాయి మళ్ళీ "సీతమ్మ కష్టాలు" ఏంటి? "హరిశ్చంద్ర కష్టాలు" కదా అనే కొచ్చెన్ మార్కు లాజిక్కొస్తే....తొట్టెం పూడి వేణు.. అంతే.

స్కూల్లో ఏ అయివోరుకి రాని అవుడియాలన్నీ ఈ ధనమ్మ మేడం కొచ్చేవి. బాగా "ఇంలీ ఈక్" కు అలవాటయి పోయిన ఈ చింతకాయ్ వెధవలకి ఏదయినా పెద్ద డోసు ఇస్తే గానీ చదవరని ఓ బ్రహ్మాండమయిన ఉపాయం కనిపెట్టింది. అదేంటంటే హిందీ లో కొచ్చెన్లు వేస్తే సరిగ్గా సమాధానం చెప్పాలి చెప్పక పోతే చెప్పినోళ్ళ చేత మొట్టికాయలు పడతాయి. అలా ఆ మేడం ప్రశ్న లేసినప్పుడల్లా విజయ అనే అమ్మాయి డింగు మంటూ చెయ్యి పైకెత్తేది. మమ్మల్నెవర్నడిగినా లైట్ వెలగని లైట్ పోల్ లా లేచి నిలబడే వాళ్ళం నోట్లొంచి "ఇంలీ ఈక్" తప్ప ఇంకేమె వచ్చేటివి కాదు. ఆ అమ్మాయేమో ఎగురుకుంటూ వచ్చి మొట్టికాయలు వేసి పొయ్యేది. అప్పట్నుండి మొదలయింది కసి. ఎలాగయినా ఈ ఆడవాళ్ళ డామినేషన్ ఆపెయ్యాలి అని. ఆ కసి హిందీ పీరియెడ్ అయి పొయ్యేదాక వుండి తరువాత చప్పు మని చల్లారి పోయేది. ఎలా గయినా హిందీ భరతం బట్టాలనే తలంపుతో ఎంత చదివినా "ఇంలీ ఈక్" గుర్తొచ్చేది తప్ప మరింకేమీ బుర్ర కెక్కేవి కాదు.

ఓ రోజు ఇలాగే హిందీ కొచ్చెన్ ల కార్యక్రమం మొదలయింది. మా మగ పిల్లకాయల్లో అందరూ లైట్ పోల్ లాగా నిలబడ్డం ఆ అమ్మాయేమో జింక పిల్ల పిల్ల లా గా ఎగురుకుంటూ వచ్చి బుర్రల్ని తడిమి ఎక్కడ వెంట్రుకలు తక్కువున్నాయో చూసి మరీ మొట్టికాయలేసేది. అసలే చదువు కోవడానికి మూడు మైళ్ళు నడిచి వచ్చేది. అందునా బాగా కాయ కష్టం చేసేదేమో ఊళ్ళో, చేతి వేలి ఎముకలు గట్టిగా వుండి మాడు పగల కొట్టేది. అప్పుడప్పుడూ అని పించేది ఇలా మమ్మల్ని కొట్టడానికి ఇంటి దగ్గర రాళ్ళ మీద ప్రాక్టీసు చేసి వాళ్ళ అవ్వ దగ్గరో తాత దగ్గరో ఎక్కడ కొడితే ఎక్కువ నొప్పి వస్తుందో అని కొనుక్కొని వచ్చేదేమో అని.

ఇలా ఇంతగా మగ పిల్ల కాయల్ని సతాయిస్తున్న ఆ అమ్మాయి మీద కసి తీర్చుకోవాలని మధ్యాహ్నం పెరుగన్నం బాగ తినేసి వచ్చిన తరువాత మగ పిల్ల కాయల సంఘం సమావేశమయింది. ఆ పిల్ల ఆకృత్యాలకు అడ్డు కట్ట వెయ్యాలంటే ఒకటే మార్గం ఈ "మొట్టి కాయల ప్రోగ్రాం" మిగతా ఏ ఒక్క అయ్యవారి చేతనయినా ఇంట్రడ్యూస్ చేయించడం. అన్ని సమాధానాలు నేనే చెప్తా కాబట్టి అందరి బదులు నేను ఆ పిల్ల నెత్తి మీద జడ బాగా పైకెత్తి గట్టి మొట్టి కాయలేసి కసి తీర్చుకోవచ్చు. అందరూ తలా రెండు ఓట్లు వేసి ఓకే చేసేసారు.

ఇక మిగిలింది అయ్యవారి చేత ఒప్పించడం. మొదటి పీరియెడ్ ఇంగ్లీషు, రాజు అయివోరు వచ్చాడు. పాఠం చెప్పే ముందు లింగుమంటూ లేసి చేతులు కట్టుకొని చంకలకింద అరిచేతులు పెట్టుకుని "సార్, మీరు కొచ్చన్లు అడగండి సార్, మేం ఆన్సర్లు చెప్తాం సార్, చెప్పని వాళ్ళకు చెప్పి నోళ్ళు మొట్టి కాయలేస్తార్ సార్" అని వినయంగా చెప్పా. పేరుకు ఇంగ్లీషు అయివోరు కానీ మూర్తీభవించిన తెలుగు పండితుడిలా రోజూ తెల్లటి లాల్చీ ధరించి వచ్చే ఆయనది ఆరడుగులకు పైన వుండే భారీ విగ్రహం. ఆయన ఆప్యాయంగా మాట్లాడే బూతు తిట్లు ఎంతో బాగుంటాయి. నేను అలా చెప్పడం ఆలస్యం ఆయన ఫేవరేట్ డైలాగ్ తో సమాధాన మిచ్చాడు.

"ఒరేయ్ నువ్వు పొద్దున్నే లేచి .... కడిగావా?" అంతే క్లాసంతా ఘొల్లు మంది. తరువాతి డైలాగ్ "నోరు మూసుకుని చెప్పింది విను...కొచ్చెన్ నాకిష్టమయినప్పుడు అడుగుతా".

చ! ఈ క్లాసు పోతే పోయింది తరువాత లెక్కల క్లాసుంది అడుగుదాంలే అని సమాధాన పరుచుకుని కూచున్నా. ఆ క్లాసు అయిపోయి సీనప్పయివోరు వచ్చినాడు. ఈ సారి కూర్చునే అడిగా .
"సార్! మీరు లెక్కల్లో కొచ్చెన్లు అడగండి సార్, వాటికి సార్...మేము...సార్....." అయివోరుకి కోపం వచ్చేసింది "ఒరేయ్ భూమి గా! ఏందన్నా అడగల్లంటే లేసి అడగల్లని తెలీదురా...ఇట్ల రారా" అని దగ్గరకు పిలిచి లాగి చెంప మీద చెళ్ళు మని ఒకటి పీకాడు. మొట్టికాయకు లెంప కాయ్ ఫ్రీ !!!. పిలిచినప్పుడు చంక కింద జాగ్రత్త పెట్టుకుని వెళ్ళిన అర చెయ్యొకటి చెంపని నిమురుకుంటూ వుంటే వచ్చి నా సీట్లో కూల బడ్డా. ఇక ఆ రోజుకి అయివోరు దగ్గరకి కొత్త ప్రతిపాదనలు తీసుకెళ్ళే సన్నివేశాలు బంద్. అయివోరు కొట్టిన దానికన్నా మా మగ పిల్లకాయల సంఘం లోని కొంత మంది నవ్వడం ఎక్కు వ బాధ పెట్టింది. సామెత ఎదో చదివినోళ్ళకే వదిలి పెట్టేశా.

తరువాత రోజు నేను చెప్పేశా "ఒరేయ్ నా వల్ల కాదు ఆ పిల్ల యేసే మొట్టికాయలు నాకు అలవాటయి పోయినాయి మీకు అవసరమ నుకుంటే మీరే అయివోరిని అడుక్కోండి" అని పిల్ల కాయల సంఘానికి రాజీనామా చేసేశా. చింత చచ్చినా పులుసు చావదని ఈ సారి డైరెక్టుగా హిందీ మేడం నే అడిగా "మేడాఁ! ప్రతి సారీ ఈ పిల్ల చేత మొటిక్కాయలు తింటున్నాం ఇట్ల కాదు గానీ మీరు హిందీలో కాకుండా ఇంకేదన్నా అడగండి" అని. దానికి అమో సారి నన్ను "దగ్గరకు రా" అని పిలిచింది. ఆహా ఏమి నా సౌభాగ్యము మేడం నా మొర ఆలకించింది మా మగ పిల్ల కాయల వెతలు తీరినవి అని పరుగెత్తుకుంటూ వెళ్ళా టేబుల్ దగ్గరకి.

"మ్మేయ్! విజయా! నువ్వీడికొచ్చి వీడి తల కాయ్ మింద ఇంగో నాలుగు మొటిక్కాయలేసి పో" అని పిలిచి సవినయంగా సత్కారం చేసింది. అప్పటికే ముందు రోజు విశేషాలు చూసి మాంచి కసి మీదుందేమో నాలుగు బొనస్ పాయింట్లు ఇచ్చి వెళ్ళింది. ఆ రోజు నుంచి ఆ పిల్ల మీదే కాకుండా మేడం మీద కూడ కసి పెరిగిపోయింది. ఎలాగయిన దారి కాసి ఓ రాయి తో ఈ మేడం తలకాయకో బొక్క, ఈ పిల్ల తలకాయకో బొక్క పెట్టాలి అని రోజు కలలు కంటుంటే ఏడో క్లాసు పాసయి పోయి ఎనిమిది లో పడ్డా. ఏదో ఆ మొట్టి కాయల పుణ్యమా అని నాలుగు ఎక్కువ "ఇంలీ ఈక్" లు నేర్చుకోవడం వల్ల ఏడు లో గుడ్డు పెట్టకుండా ఎనిమిది లో చేరా. ఈ సారి ఎనిమిది లో ఈ పిల్లని ఇరగదీయల్ల అనుకుంటా వుంటే మళ్ళీ సెక్షన్ లు వచ్చాయి. కాంపొసిట్ లెక్కలంటూ ఒక సెక్షనూ, జనరల్ లెక్కలంటూ ఒక సెక్షనూ తగలబడి. ఆ పిల్ల జనరల్ లెక్కల సెక్షన్ లోకి నేను కాంపోసిట్ లెక్కల సెక్షన్ లోకి మారి పోయి అవే సెక్షన్ లు పది వరకు సాగి మొట్టి కాయలు లేకుండానే పది ప్యాస్ అయిపోయా. పదో తరగతి హిందీ పరీక్షల్లో "కబీర్ కే దోహే" భట్టీ వేయడం మరియూ నాకు వచ్చినదంతా హిందీ అక్షరాల్లో పెట్టేయడం వల్లా అన్నింటికన్నా తక్కువగా ఓ 68 మార్కులతో బయటపడ్డా.

Thursday, April 05, 2007

ధ.దే.ఈ.శు. -- జోకు

(ధన్యవాదాలు దేవుడా ఈరోజు శుక్రవారం)


"నీ జీవితం లో అత్యంత సంతోషకరమైన రోజు ఇదే. జీవితాంతం ఈ రోజునుగుర్తు చేసుకుంటూనే వుంటావు" పెళ్ళికి పిలవడానికి వచ్చిన ఉద్యోగి తో అన్నాడు పై అధికారి.
"కానీ నా పెళ్ళి రేపు సార్" చెప్పాడు ఆ ఉద్యోగి.
"ఆ విషయం నాకు తెలుసు అందుకే చెబుతున్నాను".

బోనస్ జోకులు:

సిమెంట్ పరిశ్రమ ప్రభుత్వమిచ్చిన 487 ఎకరాల భూమి నాకు అవసరం లేదు -- వై.యెస్.జగన్.

పెద్దల(???) సభ శాసన మండలిలో మొదటి రోజే సభ్యుల సస్పెన్షన్.


అలోచించాల్సిన వార్త:


కాలిఫోర్నియా లోని గూగుల్ ఆఫీసులో దారి తప్పిన పెంపుడు కొండ చిలువ.


:

Tuesday, April 03, 2007

మా ఊళ్ళో ఉగాది సంబరాలు




చాన్నాళవుతోంది ఓ పెద్ద బ్లాగు వ్యాసం రాసి. రాద్దామనుకుంటూ వుంటే అసలు తీరిక దొరకట్లేదు. అసలు ఎందుకు రాయలేక పోతున్నానో ఓ పట్టీ తయారు చేసేస్తే అదొక పెద్ద టపా అయిపోతుంది. ఎలాగయితేనేం రాయటానికి బుర్ర లో కి కొన్ని ఆలోచనలు వచ్చాయి. ఇవయితే ఎవరూ కాపీ కొట్టలేరని ధైర్యంగా రాసేస్తున్నా.


ఓకే! ఓ రెండు మూడు కత్తెరలేస్తే....

బ్లాగులు మొదలు పెట్టిన తరువాత ఉగాది మొదటి సారిగా వచ్చింది బ్లాగు నిండా వేప మండలు, మామిడి కొమ్మలు బెల్లం ముక్కలు పెట్టేసి అందరికి పచ్చడి తయారు చేసి "పచ్చడి బ్లాగు" అవార్డు కొట్టేద్దామని సంబర పడ్డా. మామూలుగా ఉగాది అయిపోయిన తరువాత ఏ మూడు నాలుగు వారాల తరువాతో చేసే తెలుగు సంఘ ఉత్సవాలు ఈ క్రికెట్ ప్రపంచ కప్పు పుణ్యమా అని ఎంతొ ముందే పెట్టేశాం. ఆలస్యమయితే అందరూ క్రికెట్ పిచ్చిలో పడి అక్కడ స్టేజి మీద మాట్లాడే వాళ్ళు కూడ దొరకరు వుండే కార్య వర్గ సభ్యులు మాట్లాడితే పెళ్ళాలు వినాల్సి వస్తుంది. అంతే కాకుండా మేము పెట్టే లడ్లు, పచ్చళ్ళు అన్నీ మేమే పంచేసుకుని భుజమ్మీద ఇంటికి ఎత్తుకుని పోవాల్సి వస్తుందని తెలివిగా దేశంలో అందరికన్నా ముందే పెట్టేశాం. దాని హాడావుడి లో పడి బ్లాగు సంగతి మరిచి పోయా.

ఎంకి పెళ్ళి సుబ్బి చావు కొచ్చినట్టు సరిగ్గా అసలు ఉగాది ముందు రోజు మా పెద్ద బుడ్డోడికి ఏదో డ్యాన్స్ ప్రాక్టీసు పుణ్యమా అని దగ్గు వచ్చింది దానితో పాటు అదృష్టం కలిసొచ్చి జ్వరమూ, జలుబూ కూడా ఇంటిని పావనం చేశాయి. కట్ చేస్తే ఓ రోజు ఆఫీసుకు డుమ్మా. ఇంట్లో అన్ని ఉగాది సంబరాలూ బంద్. మన ప్రభుత్వమూ మరియూ పంచాంగ కర్తల పుణ్యమా అని ఒక ఉగాది కాదు రెండు చేసుకోవచ్చని కాస్త వెసులుబాటు కూడా ఇచ్చారు. కనీసం రెండో ఉగాది కూడా చేసుకోలేక పోయాం. వచ్చే సంవత్సరం నాలుగు ఉగాదులు చేసుకోవచ్చని ఓ స్టేట్ మెంట్ ఇస్తే నేను సకుటుంబ సమేతంగా టికట్టు కొనుక్కొని వచ్చి ఈ పార్టీ కే ఓటు వేస్తా. వీలయితే కొన్ని దొంగోట్లు కూడా వేస్తా!

మావాడికి బాగున్నప్పుడు చెప్పాం "ఒరేయ్ పండూ! మనింటికి గజల్ శ్రీనివాసు గారు వస్తున్నారు మనింట్లో కొన్నాళుంటారు. వాళ్ళకో ఆరేళ్ళ అమ్మాయుంది చక్కగా ఆడుకోవచ్చు" అంటే తెగ సంబర పడి పోయాడు. వాడి జ్వరం ఎంతకీ తగ్గక పోయేసరికి గజల్ శ్రీనివాస్ గారిని ఇంకొకరి ఇంట్లో వుంచ వలసి వచ్చింది. 'పండు ' ఇక రెండు రోజులు జ్వరంతో అలుగుడు. 'అమ్మ పండు ' వాడికి డ్యాన్స్ వల్లే జ్వరం వచ్చిందని గులుగుడు. 'నాన్న పండు ' సర్దుడు. ఇవన్నీ చూస్తూ 'బేబీ పండు ' కేరింతల దొర్లుడు. అలా ఇల్లంతా డు,ము,వు,లు ప్రథమా విభక్తి అయిపోయింది.

ఎలాగయితేనేం ఉగాది సాంస్కృతిక సంబరాల రోజుకి పండుకి జ్వరం తగ్గి స్టేజ్ ఎక్కి ఉగాది వేడుకలంటూ కాసేపు గెంతాడు. ఆ తరువాత అక్కడ ఏర్పాటు చేసిన మ్యాజిక్ షో కు వెళ్ళి మాయల మరాఠీ మంత్రాలు తంత్రాలు చూశాడు. మ్యాజిక్ షో ఎందుకు అంటారా? గజల్ పాదుషా మన తెలుగు గజల్ శ్రీనివాస్ గారి గానామృతం వినిపించేప్పుడు పిల్లలు సద్దు చేయకుండా వుండేందుకు.

భోజనాలయిన తరువాత మొదలయింది గజల్ గారి గానం. ఒక్కో పాటా ఒక్కో ఆణిముత్యం. ప్రతి చరణానికి చప్పట్లు. ఏ గజలయిన ఎవరి మది నయినా కదిలించ లేదంటే బహుశా వారు డాక్టరు దగ్గరకు వెళ్ళి వాళ్ళ మనస్తత్వాన్ని పరీక్షించుకోవాలి. ప్రతి గజలూ ఆడిటోరియం లో వున్న వాళ్ళను ఆత్మీయ తీరాలకు తీసుకు వెళ్ళి లాలించింది. పసితనం, బాల్యం, అమ్మ, పుట్టిన ఊరు అక్కడ జరిగిన అనుభవాలు, దేవుడు..ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో మరెన్నో. ప్రతి దాన్నీ సృజించి దాని మాధుర్యాన్ని సభికులకు అందచేసి గజలంటే ఇలా వుంటుంది అంటూ గజల్స్ తెలియని వారికి తెలియ చెప్పి వాళ్ళ మనసును కొల్ల గొట్టేశారు డాక్టరు గజల్ శ్రీనివాస్ గారు. సి.నా.రె., రెంటాల రాసిన గీతాలకు శ్రీనివాస్ గారి గాత్రం ఎంతో తియ్యదనాన్ని ఇచ్చింది. తన గజల్ కార్యక్రమంలో తను ఉపయోగించే వాయిద్యాలు ఏంటో తెలుసా ఒక్క "కంజీర" మాత్రమే. అమ్మ ను గురించి, పుట్టిన ఊరు గురించి గజలు పాడుతున్నప్పుడు ఎంత మంది కళ్ళళ్ళోనుండి నీళ్ళు జల జల మని రాలాయో.

నేను చదువు కునే రోజుల్లో పంకజ్ ఉధాస్ "చిట్టీ..ఆయీ హై.." అని పాడుతుంటే ఆర్ధ్రతతో కూడిన శ్రావ్యమైన పాట వింటుంటే అనిపించేది నాకు ఈ పాటకు అర్థం తెలుసుంటే ఎంత బాగుండేది....అలాగే తెలుగులో వింటే ఎంత బావుండేది అని. ఆ లోటు ఇప్పుడు డాక్టర్ గజల్ శ్రీనివాస్ అయిన కేసిరాజు శ్రీనివాస్ గారు పూరిస్తున్నారు. శ్రీనివాస్ గారు పాడటం ఒక ఎత్తయితే ఆయన చేసే సామాజిక అభివృద్ధి కార్యక్రమాలు ఒక ఎత్తు. సధ్బావనా యాత్ర, పాకిస్తానుకి శాంతి యాత్ర, ఖైదిల మానసిక వికాసం కోసం, సునామీ భాధితుల కోసం పాడటం. ఆయన ఎంతో మందికి ఎన్నో రకాలుగా సహాయం చేశారు. ఎంతో రాయాలని వుంది కానీ రాయలేక పోతున్నాను.

ఒక పక్క మన జీవితలో ని విషయాలను సుతారంగా మీటుతూ నాన్న పాడితే "ఎవ్వరి తో ఆటలాడుకోవాలి" అని ఆరేళ్ళ సంస్కృతి మన కంట తడి పెట్టిస్తుంది. పాట పాడటమే కాదు మాటల్తో ఎవరినైనా బోల్తా కొట్టిచ్చేస్తుంది. నన్ను మాత్రం బాగానే బోల్తా కొట్టించింది. అందుకే చెప్పా "నేను నీ ఫ్యాన్ ని, నీ ఫ్యాన్స్ అసొసియేషన్ కి ప్రెసిడెంట్ నవుతా" అని.
"అట్టాంటి ఆశలేం పెట్టుకోకు. నా ఫ్యాన్స్ అసొసియేషన్ ప్రెసిడెంట మా నాన్నే" అంది.
"అలా కాదు గానీ కనీసం అమెరికాలో ఫ్యాన్స్ అసొసియేషన్ ప్రెసిడెంట్ అవుతా" అని.
"ఠాట్, కుదరదు" అని గాఠ్ఠి గా చెప్పేసింది చిచ్చు బుడ్డి.
"ప్రస్తుతానికి వైస్ ప్రెసిడెంట్ గా సెటిలవుతా" అంటే.
"అలాగే మామా...బామ్మా.. ఆంటీ..తాతా." అంది ఆ సిసింద్రీ. నన్ను అంకుల్ అని పిలవొద్దు మామా అనో బాబాయ్ అనో పిలువు అన్నందుకు అన్ని రకాలుగా పిలుస్తోంది నన్ను.

గజల్ శ్రీనివాస్ గారిని ఇక్కడికి తీసుకు రావడానికి మాదాల రవి గారు, శ్రీధర్ గారు ఎంతగానో సాయపడ్డారు. కార్యక్రమం అయిపోయిన తరువాత రోజు శ్రీనివాస్ గారిని సకుటుంబ సమేతంగా ఇక్కడున్న కొన్ని చూడవలసిన ప్రదేశాలకు తీసుకు వెళ్ళి వచ్చాం.


ఇంతకుముందో టపా లో చెప్పా variety is spice of life అని. దాన్ని నేను పాటించడం ఏమిటో కానీ మా బుడ్డోడు అక్షరాలా పాటిస్తున్నాడు. ఇదిగో ఈ కింది ఫోటో చూడండి. అది చూసి చెప్పండి ఇందులో ఎవ్వరు వెరైటీగా నిలబడ్డారో?




350 మందికి పైగా వచ్చిన మా ఉగాది సంబరాలు ఎన్నో పత్రికల్లో ప్రచురింప బడ్డాయి. వాటి వార్తా విశేషాలకు ఈ కింద నున్న లంకెల మీదకు మీ మూషిక సాయం తో లంఘించండి.

ఈనాడు
ఆంధ్రజ్యొతి
తెలుగువన్
సినీగొయెర్
ఆంధ్రభూమి


అరవై ఏళ్ళ క్రితం వచ్చిన సర్వజిత్ నామ సంవత్సరంలో మనకు స్వాతంత్ర్యం వచ్చిందని చెబుతూ....



:


"ఉప్పుకప్పురంబు..నొక్క పోలిక నుండు" అంటూ "పండు"



:

ఓ కూచిపూడీ నృత్యం


:
'గజల్ ' మాట్లాడుతుంటే వింటున్న కార్యవర్గ సభ్యులు


:

పిల్లలు చేసిన ఓ రామాయణ ఘట్టం


:

"ఉగాది వేడుకలు" అనే కార్యక్రమం



:

"ఉగాది వేడుకలు" అనే కార్యక్రమంలో పంచాగం వింటున్న పిల్లలు



:

"ఉగాది వేడుకలు" అనే కార్యక్రమం వెనుకనున్న అతిరథులు


:


రాయల్ గార్జ్ అనే వేలాడుతున్న బ్రిడ్జ్ దగ్గర తీసిన ఫోటో.
నేను, హరి మోరి సెట్టి, గజల్, సురేఖ(గజల్ గారి భార్య), ఫోజులు కొడుతున్న "బుడిగి" సంస్కృతి, మూర్తి గరిమెళ్ళ(కోశాధికారి), శ్రీధర్ తాళంకి, CTA బోర్డ్ ఆఫ్ ట్రస్టీ మరియు ATA regional co-ordinator